తాడేపల్లి: టీడీపీ నాయకులు, పోలీసుల తీవ్ర వేధింపునకు గురై ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన శ్రీ వైయస్ జగన్ పర్యటనపైనా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తెలిపారు. ఆ దిశలోనే సినిమా డైలాగ్తో ఫ్లెక్సీపై లేని వివాదాన్ని సృష్టించి, జగన్గారిని నిందించడంతో పాటు, తనపై అక్రమ కేసు నమోదు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధీర్ భార్గవరెడ్డి మీడియాకు వివరించారు. మీడియాతో ఆయన ఇంకా ఏమన్నారంటే..: డైవర్షన్ కుట్ర: వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్ను నేను. జగన్గారిపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. నాకు షార్ట్ కట్స్ తెలియవు. జగన్గారి రెంటపాళ్ల పర్యటన కోసం మేము ఏ ప్రత్యేక ఏర్పాట్లూ చేయలేదు. అంతా స్వచ్ఛందంగా కదిలివచ్చారు. పోలీసులు ఎంత నియంత్రించాలని చూసినా వారు ఎక్కడా ఆగిపోలేదు. ఫలితంగా వచ్చే వారిని అదుపు చేయలేక ఒక దశలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. జగన్గారి పర్యటన గ్రాండ్ సక్సెస్ అని తేలడంతో, కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసింది. ఒక సినిమా డైలాగ్తో కూడిన ఫ్లెక్సీపై లేని వివాదాన్ని సృష్టించింది. నిజానికి అన్ని వేల మంది, ఎన్నో ఇతర ఫ్లెక్సీల మధ్య కేవలం ఆ ఫ్లెక్సీని మాత్రమే హైలైట్ చేస్తూ, దానిపై ఉన్న మాటల (సినిమా డైలాగ్లు)ను జగన్గారికి ఆపాదిస్తూ, టీడీపీ కూటమి ప్రభుత్వం, వారి అనుకూల మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ ఫ్లెక్సీ పట్టుకుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతడికి ఆ పార్టీ çసభ్యత్వం కూడా ఉంది. ఆ వివరాలన్నీ బయటకు వచ్చాయి. అయినా దాన్ని (ఫ్లెక్సీ) సాకుగా చూపి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, కుట్రకు తెర తీశారు. అక్రమ కేసు నమోదు: రెంటపాళ్లలో వైయస్ జగన్ పర్యటించిన రోజు (18వ తేదీ, బుధవారం) అర్ధరాత్రే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్ర బెదిరింపులకు గురి చేశారు. మర్నాడు (19వ తేదీ) స్టేషన్కు వెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు కూడా యువకుడిని చూపలేదు. వారితో కలవనీయలేదు. దీంతో అతడి భార్య పోలీస్ స్టేషన్ వద్ద తన వేదన వ్యక్తం చేసింది. (అంటూ ఆరోజు ఆమె మాటల వీడియోను మీడియాకు చూపారు) స్టేషన్లో ఆ యువకుడికి దాదాపు రెండు రోజులు నిర్భంధించిన పోలీసులు తీవ్రంగా బెదిరించి, స్టేట్మెంట్ తీసుకుని, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు నమోదు చేశారు. అలా నా మీద అక్రమ కేసు పెట్టారు. ఈ విధంగా నన్ను వేధించి, నన్ను రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు. అక్రమ కేసు. వేధించడం కోసమే పెట్టిన కేసు. జగన్గారి ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక, ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేసిన డైవర్షన్ వ్యవహారం. కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని, తమకు కోర్టులపై పూర్తి నమ్మకం ఉందని గజ్జల సుధీర్ భార్గవరెడ్డి వివరించారు.