అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం ఆయనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని చైర్మన్ కోరినప్పటికీ కూటమి పార్టీల సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో వారి తీరుపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని పక్షాల సభ్యులు కలిసి కొత్త డిప్యూటీ చైర్మన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. కూటమి సభ్యులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చ జరిగింది. మాధవరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్ పదవి వైయస్ఆర్సీపీకి దక్కడంతో పార్టీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సభలో అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరారు. డిప్యూటీ చైర్మన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అధికార పార్టీ సభ్యులు రాకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులు సభా నియమాల గురించి మాట్లాడుతున్నారని, అదే సమయంలో డిప్యూటీ చైర్మన్కు గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సభా సంప్రదాయాలు, గౌరవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజమని, కానీ సభా సంప్రదాయాలు, విలువలు శాశ్వతమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.