అనంతపురం: హంద్రీనీవా విషయంలో చరిత్రను వక్రీకరించొద్దని సీఎం చంద్రబాబుకు వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హితవు పలికారు. చంద్రబాబు పాలనలో హంద్రీనీవాను శంకుస్థాపనలకే పరిమితం చేశారని, వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే పనులు పరుగు పెట్టాయన్నారు. దాని ఫలితంగానే 2012 నుంచి జిల్లాకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. శనివారం వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్రకరూరు మండలం ఛాయాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా విషయంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే .. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలే.. ‘‘నిన్న పర్యటనలో చంద్రబాబు మాటతీరు చూస్తుంటే ఆయనలో ఏమీ మార్పు రాలేదని అర్థమవుతోంది. చంద్రబాబు రాజకీయ జీవితమంతా అపద్ధాలతోనే గడుపుతున్నారు. చేయని పనులను కూడా తానే చేసినట్లు చెప్పుకోవడానికి నిన్న పరిమితం అయ్యారు. చంద్రబాబు పాలనలోనే హంద్రీనీవా పూర్తి చేసుకున్నట్లు మాట్లాడారు. ఇది అవాస్తవం. కృష్ణా జలాల కోసం ఇక్కడ దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు. 1983లో ఎన్టీఆర్ ఓడీచెరువు వద్ద హంద్రీనీవాకు ఫౌండేషన్ వేశారు. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లూ ఎక్కడా పనులు జరగలేదు. 1996 మార్చి 11వ తేదీన ఉరవకొండలోని పోలీస్స్టేషన్ ఎదుట చంద్రబాబు మరోసారి హంద్రీనీవాకు ఫౌండేషన్ వేశారు. అప్పట్లో పరిటాల రవీంద్ర, సీపీఐ రామకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999 ఎన్నికలు వచ్చే సమయానికి కూడా గంప మన్ను తీయలేదు. చివరకు ఫౌండేషన్ వేసినందుకు కాంట్రాక్టర్కు డబ్బులు కూడా ఇవ్వలేదు. మళ్లీ 1999 జూలై 9వ తేదీన ఆత్మకూరులో 40 టీఎంసీల హంద్రీనీవాను 5 టీఎంసీలకు కుదించి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. 2004లో వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2005లో ఉరవకొండలో మళ్లీ 40 టీఎంసీలతోనే శంకుస్థాపన చేశాకే పనులు ప్రారంభం అయ్యారు. మల్యాల నుంచి 12 పంపుల ద్వారా జీడిపల్లికి మొదటి దశ, జీడిపల్లి నుంచి పుంగనూరు వరకు రెండో దశ పనులు చేపట్టారు. 6.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తలచారు. వైయస్ఆర్ హయాంలోనే హంద్రీనీవాకు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. 2012 నవంబర్ 18వ తేదీన మల్యాలలో కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి విడుదల చేస్తే నేను, రఘువీరారెడ్డితో పాటు ఎంతో మంది నాయకులు నీటి వెంబడి పాదయాత్ర చేశాం. 2012 నవంబర్ 29వ తేదీన జీడిపల్లికి నీరు తెచ్చాం. ఆ రోజు జీడిపల్లిలో జరిగిన సభకు పయ్యావుల కేశవే అధ్యక్షత వహించారు. ఇది జగమెరిగిన సత్యం. బాబు వల్లే హంద్రీనీవా ఆలస్యం చరిత్రను మూసిపెట్టి ప్రజలను తప్పుదోవపట్టించాలని నిన్న చంద్రబాబు ప్రయత్నించారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన ద్రోహం వల్లే హంద్రీనీవా ఆలస్యం అయ్యింది. చంద్రబాబు 1996లో శంకుస్థాపన చేసిన తర్వాత పనులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు మనకు నికర జలాలు అందేవి. కానీ, నేటికీ మిగులు జలాలపై హంద్రీనీవా ఆధారపడిందంటే అది చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేసి వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా హంద్రీనీవా సామర్థ్యం పెంచాలని, విస్తరించాలని మేం కోరాం. కానీ ఆయన పట్టించుకోలేదు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక కంటి వెలుగు కార్యక్రమానికి అనంతపురానికి వచ్చిన సమయంలో హంద్రీనీవా సామర్థ్యం పెంచాలని కోరాం. ఆనాడు మాట ఇచ్చిన ప్రకారమే 6300 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా విస్తరణకు అనుమతిస్తూ జీవో కూడా వైయస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. వైయస్ఆర్సీపీ హయాంలోనే రూ.4647 కోట్లతో టెండర్లు కూడా పూర్తయ్యాయి. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లు రద్దు చేసి మళ్లీ 3850 క్యూసెక్కులకే హంద్రీనీవా విస్తరణ పనులు చేపడుతున్నారు. రాయలసీమ ద్రోహి బాబే గత ఎన్నికల సమయంలో హంద్రీనీవా సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నేడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. 3850 క్యూసెక్కులతో జీడిపల్లికి నీరు రావాల్సి ఉంటే సాంకేతిక కారణాలతో నేడు 2200 క్యూసెక్కులే వస్తున్నాయి. రెండో దశలో జీడిపల్లి నుంచి 1200 క్యూసెక్కులే వస్తున్నాయి. ఆ మేరకే అక్కడ లైనింగ్ చేయడం అంటే ఇక్కడ రైతాంగాన్ని ద్రోహం చేసినట్లే. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు, హంద్రీనీవానే ఆధారం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్లే అంటున్నారు. మరి భవిష్యత్లో ఎక్కువ పరిశ్రమలు రావాలంటే నీరు ఎలా తెస్తారు? రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుపైన తెలంగాణకు కూడా హక్కు ఉంది. వాళ్లు నీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తేనే రాయలసీమకు ప్రయోజనం. అందుకే హంద్రీనీవా సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు చేయాలని కోరుతున్నాం. ప్రజలకు మంచి చేయమని కోరుతున్నాం ఇది జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల డిమాండ్. ఇప్పటికైనా మాపై విమర్శలు మానుకుని జిల్లా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని హంద్రీనీవా సామర్థ్యంను 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. జిల్లాలోని టీడీపీ, బీజేపీ నాయకులకు మమ్మల్ని విమర్శిస్తే ఏమీ రాదు. మేం గాలిమాటలు కబుర్లు చెప్పడం లేదు. ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం. మీరు చంద్రబాబు వద్ద డూడూ బసవన్న అంటే తలలు ఊపకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోండి. ఇక నిన్న సభలో జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఒక్కరు కూడా మాట్లాడకపోవడం బాధాకరం. ఉరవకొండ నియోకవర్గంలో మిర్చి సాగు అధికం. కానీ ధర లేదు. కందులు, శనగ, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. అయినా ఎవరూ మాట్లాడలేదు. మేం డిమాండ్ చేసేది ఒక్కటే..! హంద్రీనీవా లైనింగ్ పనులను వెంటనే స్టాప్ చేసి 10 వేల క్యూసెక్కులకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా చేయండి. అప్పుడే చరిత్రలో మీ పేరు నిలబడి పోతుంది. లేకపోతే చరిత్రలో సీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారు’’ అని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వీరజవాన్ మురళీనాయక్కు జోహార్లు యుద్ధభూమిలో వీరమరణం పొందిన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీనాయక్కు అనంత వెంకటరామిరెడ్డి జోహార్లు అర్పించారు. మురళి నాయక్ త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మరువదననారు.