చదువులను ప్రోత్సహించేలా వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

మన తలరాతలను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది

వధూవరులకు పదో తరగతి ఉత్తీర్ణత, వయస్సు పరిమితి తప్పనిసరి చేశాం

ఈ పథకంలో మనం తెచ్చిన నిబంధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి

పేద కుటుంబాలు పిల్లల పెళ్లీళ్లకు అప్పులపాలు కాకూడదని సాయం పెంచి ఇస్తున్నాం

వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నేడు ఐదో విడత అమలు చేస్తున్నాం

10,132 జంటలకు రూ.78.53 కోట్ల సాయం అందిస్తున్నాం

ఇప్పటి వరకు 56,194 జంటలకు రూ.427.27 కోట్లు అందించాం

గత ప్రభుత్వంలో అరకొర సాయం, అది కూడా 17,709 మంది జంట‌ల‌కు ఇచ్చే రూ.70 కోట్లు ఎగ్గొట్టారు

మన ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మిస్‌కాకుండా సాయం అందిస్తున్నాం

మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ గ్రామ సచివాలయాల్లోనే పొందేలా మార్పులు చేశాం

వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం మన ప్రభుత్వం తెచ్చిన రెండు నిబంధనలు నిరుపేదల చదువులను మరింత ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు చదువుకుంటేనే వచ్చే తరం కూడా ఆటోమెటిక్‌గా చదువుల బాట పడుతుంది. అందుకే ఈ పథకం అమలులో పదో తరగతి ఉత్తీర్ణత, వయో పరిమితిని కచ్చితం చేశాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చదువుతోనే పేద కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా సాయం విడుదల చేస్తున్నామని, నేడు ఐదో విడతగా 10,132 జంటలకు మంచి జరిగిస్తూ రూ.78.53 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 56,194 జంటలకు రూ.427.27 కోట్లు జమ చేశామని చెప్పారు. 

అక్టోబర్‌–డిసెంబర్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 10,132 జంటలకు రూ.78.53 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. అంతకుముందు వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలోని నిబంధనల వల్ల జరుగుతున్న మేలు, చదువుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఇస్తున్న ఫలితాల గురించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం అమలు జరుగుతుంది. వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా దాదాపుగా 10,132 మంది జంటలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్‌ వధువుకు, వరుడికి ఉండాలని ఈ పథకంలో నిబంధన పెట్టాం. దీని వల్ల కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. వయస్సు పరిమితి వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు మరో నిబంధన పెట్టాం. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినా, వయస్సు నిండకుండా పెళ్లి చేసుకుంటే ఈ పథకం వర్తించదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ చదివితే అమ్మ ఒడి పథకం ఇస్తుంది. పది పూర్తయిన వెంటనే ఇంటర్మీడియట్‌ చదువులకు వెళ్తారు. ఒకసారి ఇంటర్మీడియట్‌ పూర్తయిన తరువాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాం కాబట్టి డిగ్రీ వరకు వెళ్లారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి చదువులు చదివే పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్‌ అయ్యేలా అడుగులు వేయిస్తున్నాం. 

నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు చదివి ఉంటే తరువాత తరం కూడా ఆటోమెటిక్‌గా చదువుల బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్‌ మారాలన్నా, తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలంటే మంచి చదువులు మనకు ఉంటే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. 

గత ప్రభుత్వ హయాంలో నామ్‌కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామనే పరిస్థితి కాకుండా ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే నూతన జంటల కుటుంబానికి నగదు సాయం విడుదల చేస్తున్నాం. ఎక్కడో సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌కు వెళ్లే అవకాశం లేకుండా నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేలా మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి ఒక్కరూ మిస్‌ కాకుండా అప్లయ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాం. 

  • ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40 వేలే. ఇప్పుడు మ‌న ప్ర‌భుత్వం అందిస్తున్న‌ సాయం రూ.1,00,000. 
  • ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, ఇప్పుడు మ‌నం అంది­స్తున్న సాయం రూ.1,20,000. 
  • ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు కాగా, మ‌నం అందిస్తున్న సాయం రూ.1,00,000. 
  • ఎస్టీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75 వేలే కాగా, మ‌నం అందిస్తున్న సాయం రూ.1,20,000. 
  • బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35 వేలు మాత్రమే. మ‌నం అంది­స్తున్న సాయం రూ.50,000. 
  • బీసీల కులాంతర వివాహానికి గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలే కాగా, ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000. 
  • మైనార్టీలు, దూదేకులు, నూర్‌ బాషాల పిల్ల­ల వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50 వేలు మాత్రమే. ఇప్పుడు మ‌నంద‌రి ప్ర‌భుత్వం దానిని రూ.1,00,000కు పెంచి అందిస్తుంది. 
  • భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.20,000 కాగా, మ‌నంద‌రి ప్ర‌భుత్వం అందిస్తున్న సాయం రూ.40,000. 

పిల్లల పెళ్లీళ్ల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని వీలైంతన వరకు సహకరించే విధంగా నగదు సాయం పెంచి అందిస్తున్నాం. గతంలో 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపుగా రూ.70 కోట్లు ఎగ్గొట్టారు. ఈరోజు మన ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదని త్రైమాసికం అయిపోయిన వెంటనే అర్హులకు సాయం అందిస్తున్నాం. రూ.78 కోట్లు అందిస్తున్నాం. ఇంతవరకు 56,194 జంటలకు, వారి కుటుంబాలకు మంచి జరిగిస్తే రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే అందించాం. ఈ పథకం వల్ల అందరికీ మంచి జరగాలని నూతన వధూవరులకు ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా మంచి జరగాలని, ఆ మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా
 

Back to Top