‘సానుభూతి కార్డు’తో ఆంధ్రుల మనసులు గెలుచుకోలేరు బాబూ! 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ‘ నాకు 2024 అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు. అప్పుడు నన్ను గెలిపించి పంపితేనే నేను రాజకీయాల్లో ఉంటాను,’ అంటూ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ప్రజలను వేడుకున్న తీరు తెలుగుదేశం రాజకీయ భవితవ్యానికి సంకేతం. ‘ వచ్చే ఎలక్షన్లలో నాకు అధికారం అప్పగించకపోతే నేను శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుంటా,’ అనే తీరులో మాజీ హైటెక్‌ ముఖ్యమంత్రి అఖిలాంధ్ర ప్రజానీకాన్ని బతిమాలుకుంటూ ‘బెదిరించడం’ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను దిగ్భాంతి కలిగిస్తోంది. 1978 నుంచీ క్రియాశీల, ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతున్న కుప్పం ఎమ్మెల్యే గారు పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయాల నుంచి ఎంతో కొంత నేర్చుకుంటే ఆయనకూ, ఆయన పార్టీకి మంచిది. ఎందుకంటే, ప్రజలు ‘సానుభూతి కార్డు’ను గాని లేదా ‘లూజర్‌ కార్డు’ను (మీ మద్దతు లేకుంటే ఓడిపోతా, జాగ్రత్త అని సూచించే) గాని ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన నాయకుడు జనం ముందు బయటకు తీస్తే ఓటర్లు మెచ్చరు. అంతేకాదు, ఈ ప్రాంతీయపక్షం అధినేతకు ఆత్మవిశ్వాసం లేదంటూ ఈసడించుకుంటారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తండ్రి ఎం.కరుణానిధి గారి గురించి గుర్తుచేసుకుందాం. 

వరుసగా మూడు ఎన్నికల్లో ఓడినా కరుణాధి గారు బీద అరుపులు అరవలేదు! 
1969–76 మధ్యలో దాదాపు 7 సంవత్సరాలు తమిళనాడు సీఎంగా ఉన్న కరుణానిధి గారు వరుసగా మూడు ఎన్నికల్లో (1977, 80, 85 అసెంబ్లీ ఎన్నికలు) ఓడిపోయారు.అంటే, ఆయన నేతృత్వంలోని ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పరాజయం పాలయింది. చివరికి నాలుగో ప్రయత్నంలో ఆయన పార్టీ  1989 జనవరి ఎన్నికల్లో విజయం సాధించింది. కరుణానిధి 13 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆంతేగాని, చంద్రబాబు మాదిరిగా తాను ఓడిపోయిన ఏ అసెంబ్లీ ఎన్నికల ముందు, ‘నాకివి చివరి అసెంబ్లీ ఎన్నికలు. నా పార్టీని గెలిపించి నన్ను సీఎంను చేస్తే, నేను రాజకీయాల్లో ఉంటా. లేకపోతే ఇంట్లో కూర్చుంటా,’ అని తమిళ ప్రజలను వేడుకోలేదు, బెదిరించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటమి ఎదురైనా నిరాశచెందని నాయకులనే ప్రజలు ఇష్టపడతారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న దివంగత జననేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారు 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడినాగాని నిరంతరం జనం మధ్యనే ఉన్నారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లు పదవిలో కొనసాగి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించి మళ్లీ సీఎం అయ్యారు. అంతేగాని, ఆయన 2003లో చేసిన పాదయాత్రలో ఎక్కడా, ‘నాకు ఇవే చివరి ఎన్నికలు,’ అనలేదు. జనం సానుభూతి కోసం ప్రయత్నించలేదు. దివంగత నేతలు కరుణానిధి, రాజశేఖర రెడ్డి రాజకీయ జీవిత చరిత్రలు టీడీపీ అధినేత ఇప్పుడైనా చదివి, సరైన మార్గంలో ముందుకు పోవడం నేర్చుకోవాలి.

Back to Top