తాడేపల్లి: రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల పురోగతి ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తించిన గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ దిశలోనే పలు చోట్ల మెగా ఇండస్ట్రియల్ హబ్లు, ఈఎంసీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2019, ఆగస్టులో ప్రతిపాదన చేయగా, అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటుకు సంబంధించి 2021, మార్చిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) నుంచి అనుమతి వచ్చింది. దాంతో అదే ఏడాది.. 2021, డిసెంబరులో కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ను వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సదుపాయాలు కల్పించడంతో, పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ పారిశ్రామిక రంగంలో జిల్లా రూపురేఖలనే మార్చేసింది. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2022–23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు, వెంటనే తమ పనులు ప్రారంభించాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలుపెడుతున్నాయి. ఈ సందర్భంగా టెక్నోడోమ్, టెక్సానా సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులందరికీ ఎక్స్ వేదికగా వైయస్ జగన్ అభినందనలు తెలియజేశారు. వాణిజ్య పరంగా రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2019–24 మధ్య రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 11.12 శాతం సగటు వృద్ధి (సీఏజీఆర్) సాధించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ రంగంలో నమోదైన వృద్ధి (సీఏజీఆర్) 6.9 శాతం మాత్రమే అని గుర్తు చేసిన శ్రీ వైయస్ జగన్, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటైన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు.