హైదరాబాద్: నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని లాక్కుని 1995 సెప్టెంబర్ 1న అడ్డదారిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాడని, ఎన్టీఆర్ ఆత్మ ఇంకా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ను ఎలాగైతే కుట్రలతో గద్దె దించాడో, నేడు వైఎస్ జగన్ గారి పైనా అవే కుట్రలు చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. మహనీయుడు ఎన్టీఆర్.. ద్రోహి చంద్రబాబు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 9 శాతం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నేత ఆయన. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేసి, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వీపీ సింగ్ గారిని ప్రధానిని చేసిన మహానుభావుడు. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, కమ్యూనిస్టులతో కలిపి ఏకంగా 258 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఎనిమిది నెలలు తిరక్కుండానే చంద్రబాబు ద్రోహం చేశాడు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా వెన్నుపోటు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేక ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. చంద్రబాబు మాత్రం వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మందు, మాంసంతో విందులు, వినోదాలు చేసుకున్నాడు. ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించి, పార్టీ ఫండ్ ను ఆపేశాడు. తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబు లాంటివాడు చంద్రబాబు. సెప్టెంబర్ 1న అడ్డదారిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్గా మిగిలిపోయాడు. ఆయన జీవితమంతా అబద్ధాల మయమే చంద్రబాబు జీవితమంతా అబద్ధాలే. ఎన్నికలకు ముందు సంక్షేమం అంటాడు, గెలిచాక సంస్కరణలు అంటాడు. విజనరీ అనే పదాన్ని కూడా ఆయన చోరీ చేశాడు. భోగాపురం ఎయిర్ పోర్ట్, వెలిగొండ తదితర ప్రాజెక్టులను వేరే వాళ్ళు కడితే.. ముందుగా శిలాఫలకాలు వేసి, ఆ క్రెడిట్ అంతా తాను కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి నీచుడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరు. చివరకు ఆయన కొడుకు లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినట్లు కనీసం ఆ సర్టిఫికెట్ కూడా చూపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట ఎన్టీఆర్ గారు చనిపోయే చివరి క్షణం వరకు ఈ దుర్మార్గుడు ఆయన్ని క్షోభకు గురిచేశాడు. తన చేతిలో ఉన్న మీడియాను, న్యాయవ్యవస్థలోని బలహీనతలను వాడుకుని కోర్టులను, ఢిల్లీలో కాంగ్రెస్ను మేనేజ్ చేసి ఎన్నికల సంఘం ద్వారా పార్టీ సింబల్ను కూడా లాక్కున్నాడు. అసలు ఎన్టీఆర్ ఫొటోలు పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. నాడు ఎన్టీఆర్పై ఏ విధంగా కుట్రలు చేశాడో, ఈరోజు జగన్ గారిపై కూడా అలాగే కుట్రలు చేస్తూ కుటుంబ సభ్యులను దూరం చేస్తున్నాడు. ప్రజలు ఈ వెన్నుపోటు దారుడి నైజాన్ని ఎప్పటికైనా గుర్తిస్తారని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.