తాడేపల్లి: మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) కార్యక్రమం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, జైన్ సంక్షేమ సంస్థ మాజీ అధ్యక్షుడు మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ (కార్యదర్శి), ప్రవీణ్ ఫౌలాముతా (విద్యాసంస్థ ప్రతినిధి), ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైన్ సమాజానికి చెందిన నాయకులు మహావీర్ బోధనలను స్మరించుకుంటూ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. మహావీర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్ మహావీర్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సందేశంలో మహావీర్ బోధనల ప్రాముఖ్యతను వివరించారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ అని ఆయన పేర్కొన్నారు. ఆ మహర్షి చూపిన మార్గం ఎల్లప్పుడూ ఆచరణీయమని తెలిపారు. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు.