తాడేపల్లి: మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ అనంతరం తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడి, వారికి మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకమని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. సమాజంలో పరస్పర గౌరవం, సహనం, సామరస్యం మరింతగా పెంపొందేందుకు ప్రవక్త చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మత సామరస్యం, సోదరభావం మరింత బలపడాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ మరోసారి శ్రీ వైయస్ జగన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.