గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమా పురుష అహంకారులని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి మండిపడ్డారు. విజయవాడ ఆసుపత్రి వద్ద ఆ ఇద్దరు చేసిన తప్పులకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి అయితే మహిళా కమిషనర్ను తిడతారా..? భయపెడతారా..? అని ధ్వజమెత్తారు. ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు. మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్పర్సన్ను అడ్డుకోవడం ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు.