ప్రేమోన్మాదుల‌కు సభ్య సమాజంలో బ‌త‌క‌డానికి అర్హ‌త లేదు

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  వాసిరెడ్డి ప‌ద్మ‌

తేజస్విని భౌతిక కాయానికి నివాళుల‌ర్పించిన మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌

ఆడ‌బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోస‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశ చ‌ట్టాన్ని రూపొందించారు

నెల్లూరు: ప్రేమోన్మాదుల‌కు సభ్య సమాజంలో బ‌త‌క‌డానికి, ఉండటానికి కూడా అర్హ‌త లేద‌ని  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయిన తేజస్విని భౌతిక కాయానికి వాసిరెడ్డి ప‌ద్య‌ నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చ‌దువుకుని కూడా మూర్ఖ‌త్వంగా ప్రేమించ‌లేద‌నే కారణంతోనే, పురుష ఉన్మాదంతో, ఆడ‌వారి మీద మాకు హ‌క్కు ఉంద‌న్నట్టుగా ఆడ‌బిడ్డ‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకునే ప‌రిస్థితి మారాలి. ఇటువంటి ప్రేమోన్మాదులు సభ్య సమాజంలో బ‌త‌క‌డానికి, ఉండటానికి కూడా అర్హ‌త లేద‌ని అంద‌రూ భావించే ప‌రిస్థితి. 

  తేజ‌స్విని హ‌త్య చేసి, ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు డ్రామా ఆడాడు.. ఇది చాలా దుర్మార్గ‌మైన విష‌యం  దిశ చ‌ట్టం ప్ర‌కారం వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేసి,  ఇటువంటి కేసుల్లో వేగంగా తీర్పు వ‌చ్చేలా, క‌ఠిన‌మైన శిక్ష ప‌డేలా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.  ఈ కేసు ద‌ర్యాప్తునకు సంబంధించి ఎస్పీగారితో మాట్లాడ‌టం జ‌రిగింది.. డీఎస్పీ ద‌ర్యాప్తు చేస్తున్నారు   ఇటువంటి కేసుల్లో ఉన్మాదులు త‌ప్పించుకోరాదు.  ఈ కేసులో అత్యంత వేగంగా క‌ళ్ల‌ముందే నిందితుడికి శిక్ష ప‌డే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నాము.

 ఆడ‌బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోస‌మే సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ దిశ చ‌ట్టాన్ని రూపొందించారు.. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించాల్సి ఉంది..  దిశ పోలీస్ స్టేష‌న్ లు ఏర్పాటు చేశాం, కేసు విచార‌ణ వేగ‌వంతంగా జ‌ర‌గ‌డానికి ప్ర‌త్యేకించి ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ల‌ను నియమించడం, స్పెషల్ కోర్టుల‌లో వేగంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.  ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం చాలా బాధాక‌రం. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రగ‌కుండా ఉండ‌టానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం.. ఆ ప్ర‌య‌త్నం మ‌రింత ముమ్మ‌రం కావాలి.
- ఆపదలో మహిళలకు రక్షణగా నిలిచే దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల‌నే చైత‌న్యం మ‌హిళ‌ల్లో బాగా వ‌చ్చింది

 తేజ‌స్విని కూడా త‌న‌ను తాను కాపాడుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేసినా, పోలీసుల సకాలంలో వ‌చ్చిన‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌వ‌సశాత్తూ మూడు నిమిషాల్లోనే ప్రాణం తీసిన ప‌రిస్థితి.  ప్రేమ పేరుతో.. త‌న క‌ళ్ల‌ముందే చావాల‌నే ఉన్మాదంతో ఉన్మాది చేసిన‌టువంటి దుర్మార్గం. లేక‌పోతే తేజ‌స్విని బ‌తికి ఉండేది.   ఇంత క‌ఠినంగా, దుర్మార్గంగా ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటువంటి ఉన్మాదులు దొరికితే స‌మాజం కూడా బాధ్యతగా వారిని శిక్షించాలి.   చ‌ట్టం, న్యాయం వాటి ప‌ని అవి చేస్తాయి. కానీ ఆడ‌పిల్లల జోలికి వ‌స్తే ఎవరూ ఊరుకోరు అనే ఇండికేష‌న్ క‌చ్చితంగా ప్ర‌తి ఇంటి నుంచి వెళ్లాలి.  అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణం తీసిన వ్య‌క్తికి జీవితం లేదు అనే గుణ‌పాఠం స‌మాజం నేర్పాల‌ని వాసిరెడ్డి ప‌ద్మ పేర్కొన్నారు.

Back to Top