అమరావతి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బల్లి దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. సీఎం వైయస్ జగన్ సంతాపం.. బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో ఫోన్లో మాట్లాడిన సీఎం వైయస్ జగన్.. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మరణం తీరని లోటు: ఎమ్మెల్యే భూమన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ‘ఆయన మంచి మేధావి. రెండు దశబ్దాలుగా ప్రజా జీవితంలో వున్నారు. ఎప్పుడు ప్రజల కోసం పరితపిస్తుంటారు. ఆయన మృతి తీరని లోటు. తిరుపతి అభివృద్ధిలో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చెదరని ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని సంతాపం ప్రకటించారు. హఠాన్మరణం కలచివేసింది: ఎమ్మెల్యే బియ్యపు బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం కలచివేసిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.