వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి 

అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుప‌తి: వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి, చైతన్యం రావాల‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. తద్వారా మరింత మంచి వాతావరణం నెలకొంటుంద‌ని ఆయన వ్యాఖ్యానించారు. సుస్థిర వ్యర్థ నిర్వహణపై తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు సుమారు 51 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వ్యర్థాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యర్థాల నిర్వహణ ముఖ్యమని, వ్యర్థ నిర్వహణ ఒక బరువు గల బాధ్యతగా కాకుండా ఒక అవకాశం లా చూడాలన్నారు. తద్వారా అనేక మందికి ఉపాధి లభించడంతో పాటుగా గ్రీన్ హౌజ్ గ్యాస్ లను తగ్గించ వచ్చన్నారు. అంతేకాకుండా.. ‘ స్వీయ సుస్థిర వ్యర్థ నిర్వహణ మాత్రమే ఇందుకు పరిష్కారం. ఏపీలో 123 మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, నగరపంచాయత్లు ఉన్నాయి.
 ఇందులో సుమారు 1.49 కోట్ల పట్టణ జనాభా, 44.57 లక్షల గృహాలు ఉన్నాయి. క్లీన్ ఆంధ్ర మిషన్ (క్లాప్) ద్వారా వ్యర్థ రహిత నగరాలుగా వీటిని తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం 3648 హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లు, డీజల్, ఎలెక్ట్రిక్ ఆటోలు, 24 వేల రిక్షాలు అందించాం. వీటి ద్వారా సుమారుగా రోజుకు 7 వేల టన్నుల వ్యర్ధాలను తరలిస్తున్నాం. ఇవేకాక 2.43 లక్షల టాయిలెట్స్, 623 పబ్లిక్ టాయిలెట్స్, 795 కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. వీటన్నిటి ద్వారా క్లాప్ సుమారుగా 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించింది.

 
ఇప్పటికే రాష్ట్రంలో 48 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అందుబాటులో ఉన్నాయి. మరో 59 నిర్మాణ దశలో ఉండగా, అదనంగా 206 టెండర్ దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తో రాష్ట్రంలో 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల చెత్త బుట్టలు అందించాం. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుమారు 2 కోట్ల చెత్త బుట్టలు అందించేందుకు రంగం సిద్దం చేస్తున్నాం. వ్యర్థాల నుండి విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రోజుకు 2400 టన్నుల వ్యర్థ నుండి 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు.

Back to Top