నిజాయితీ..నిబ‌ద్ధ‌త అన్న‌వే ప్రామాణికాలు

   రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాదరావు
 

శ్రీ‌కాకుళం: నిజాయితీ..నిబ‌ద్ధ‌త అన్న‌వే మా ప్ర‌భుత్వానికి ప్రామాణికాలని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాదరావు అన్నారు. గార‌ మండ‌లంలో త‌హ‌శీల్దార్, ఎంపిడివో కార్యాలయాలను రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.."ఓ కార్యాల‌యం విసుగు క‌లిగించే విధంగా ఉంటే మ‌న‌సు పెట్టి చేయ‌డం సాధ్యం కాదు కానీ వ‌స‌తులు ఉంటే మ‌న‌సు పెట్టి చేయాల‌ని అనిపిస్తుంది. ఇక్క‌డి కార్యాల‌య భ‌వ‌న నిర్మాణపు ప‌నుల‌కు టీడీపీ హ‌యాంలో శంకుస్థాప‌న చేశారు.. వైయ‌స్ఆర్‌ సీపీ హయాంలో పూర్తైంది. మంచి పాల‌న అంటే మంచి మార్పులో ఉంది. పరిపాల‌న‌ను వికేంద్రీక‌రించాల‌న్న ఆలోచ‌న  ఉంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప‌రిపాల‌న తీసుకుని రావాల‌ని చాలా వ‌ర‌కూ కృషి చేశారు. కొద్దో గొప్పో జ‌రిగింది. కానీ వైసీపీ హ‌యాంలో ప‌రిపాల‌న‌ను కింది స్థాయికి చేర్చ‌డం జ‌రిగింది. పంచాయ‌తీ స్థాయికి ఓ కార్యాల‌యాన్ని తీసుకుని వ‌చ్చిన ఘ‌న‌త వైయ‌స్సార్ దే. మండ‌ల కార్యాల‌యానికి, త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి ఇది వ‌ర‌కులా రావ‌డం లేదు. నా ద‌గ్గ‌ర‌కు కూడా ఇదివ‌ర‌క‌టిలా వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గిపోయింది. ఇదంతా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల సాధ్యం అయింది. అర్హ‌త నిర్ణ‌యించిన త‌రువాత ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు చేరే విధంగా చేసే ప్ర‌క్రియ స‌జావుగా సాగిపోతోంది."

అవాకులూ చ‌వాకులూ విన‌కండి 
"ప్ర‌జాస్వామ్యంలో కొంద‌రు అవాకులూ చ‌వాకులూ మాట్లాడినా ప్ర‌భుత్వం ఎప్పుడూ ప్ర‌జ‌ల‌ను సంతోష పెట్టాల‌ని చూస్తుంది. ఇది పెద్ద రివ‌ల్యూష‌న్. బ్రిటిష్ కాలం త‌రువాత ల్యాండ్ రీ స‌ర్వేను చేస్తున్న ఘ‌న‌త వైయ‌స్ఆర్‌ సీపీదే. అప్ప‌టికీ ఇప్ప‌టికీ వ‌చ్చిన ప‌రిణామాల మార్పు కార‌ణంగా ఇప్పుడు మ‌రో సారి ల్యాండ్ ను  స‌ర్వే చేయిస్తున్నాం.ఆ రోజు వందేళ్ల కింద‌ట భూ స‌ర్వే జ‌రిగింది. అది కూడా ప్రామాణికంగానే ఉంది . నాలుగు త‌రాలు మారిపోయాయి. కొల‌త‌లు మారిపోయాయి. ఇన్ని జ‌రుగుతున్నా స‌రిదిద్ద‌డానికి రికార్డు లేదు. ఎప్పుడ‌యినా ఓ బ‌ల‌హీనుడు  త‌న ఆస్తి ని రుజువు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దో ఆ రాజ్యంలో బీద‌వాడి ఆస్తులన్నీ ధ‌న‌వంతుల చేతికి చిక్కిపోతాయి అని విన్న‌విస్తున్నాను."

టైటిల్ బాగుంటే అన్నీ బాగుంటాయి

"త‌న ఆస్తిని తాను సులువుగా రుజువు చేసుకునే అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించాలి. వీటి కార‌ణంగా అనేక త‌గాదాలు వ‌స్తున్నాయి. భూ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇవ‌న్నీ వ‌స్తున్నాయి. భూ హ‌ద్దులు నిర్ణ‌యం అయితే ఇక పై త‌గాదాలు త‌గ్గుతాయి. శాంతి సామర‌స్యాలు మ‌రింత పెరుగుతాయి. నిరంత‌రం తీవ్ర‌మ‌యిన గొడ‌వ‌ల‌తో న‌లిగిపోవ‌డం అన్నది గ‌తంలో ఉండేది. కానీ ఇప్పుడు స‌ర్వే పూర్తయితే అటువంటివేవీ జ‌ర‌గ‌వు. అదేవిధంగా గ్రామం కానీ దేశం కానీ బాగుప‌డాలంటే పెట్టుబ‌డి కావాలి. అందుకు బ్యాంకు రుణాలు కావాలి. అందుకు ఆస్తి ప‌త్రాలు త‌నాఖాలు పెట్టి రుణాలు పొందాలి. టైటిల్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే ముఖ్య‌మంత్రి భూ స‌ర్వే పై దృష్టి సారించారు. ఇందుకు అధికారుల‌కు గ్రామ‌స్తులు స‌హ‌క‌రించాలి. ఏమ‌యినా ఉంటే అభ్యంత‌రాలు ఉంటే అప్పీలేట్ అథారిటీని సంప్ర‌తించండి. ఈ అవ‌కాశాన్ని రైతులంతా ఉప‌యోగించుకోవాలి. గ్రామ స‌చివాల‌యం ప‌రిధిలో టెక్నిక‌ల్ స్టాఫ్ అంతా స‌ర్వేల్లో పాల్గొంటున్నాయి." 

విశాల దృక్ప‌థాన్ని అర్థం చేసుకోవాలి 

"రాష్ట్రంలో శ్రీ‌కాకుళ‌మే స‌ర్వేల‌లో ముందుంది. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డున్న వారిని అభినందిస్తూ ఉన్నాను. రికార్డులు అప్డేట్ అవుతున్నాయి.. చాలా సంతోషం గా ఉంది. ఇంత ప‌ని జ‌రుగుతుంటే ఇదంతా ఓట్లు కోసం అని ఎవ్వ‌రైనా అన‌గ‌ల‌రా ? కానీ జ‌గ‌న్ చేసే ప‌నుల‌న్నీ ఓట్ల కోస‌మే అని అంటారు కొంద‌రు. వందేళ్ల కాలంలో చేయ‌లేని ప‌నులు చేస్తుంటే ఎప్రిషియేట్ చేయాలే కానీ  ఇందుకు విరుద్ధంగా మాట్లాడ‌డం స‌బ‌బు కాదు. అదేవిధంగా బడుల‌ను మంచి స్థాయిలో తీర్చాక బ‌ట్ట‌లు, భోజ‌నం, పుస్త‌కాలు, నోట్స‌లు ఇస్తుంటే ఇవ‌న్నీ ఓట్ల కోస‌మా చెప్పండి.. అమ్మ అకౌంట్ల‌లో డ‌బ్బులు వేస్తున్నామంటే ఓట్లు కోస‌మా ..ఇందులో ఉన్న విశాల దృక్ప‌థాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడ‌డం స‌బ‌బు కాదు. ఏ విధంగా చూసుకున్నా రాష్ట్రం 22 వ స్థానంలో అక్ష‌ర రాస్య‌త విష‌యంలో ఉంది. అంటే ఇంకా బీద‌ల‌కు విద్య‌ను స‌మున్న‌త స్థాయిలో ఇంత‌కాలం అందించ‌లేక‌పోయారు. అంద‌రినీ చ‌దివించే హ‌క్కు.. అంద‌రికీ  సమాన అవ‌కాశాలు అందించే హ‌క్కు రాజ్యాంగం అందించింది. వాటిని అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం ఇది. మొన్న నేను ఓ గ్రామానికి వెళ్లాను. అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట‌ర్ చూశాను. " జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీరంద‌రి క‌న్నా గొప్ప‌వాడు.. 

 "అదే ఇంటికి వెళ్లి నేను అడిగితే అన్ని ప‌థ‌కాలు అందుతున్నాయి. అంతా బాగుంది అన్న మాట వచ్చింది. అందుకే నీ ఉన్న‌తికి ఎవ‌రు సహ‌క‌రిస్తున్నారో వారిపై నీకు నాలెడ్జ్ ఉండాలి క‌దా ! ప్రాక్టిక‌ల్ లైఫ్ వేరు, రియ‌ల్ లైఫ్ వేరు అని చెప్పేందుకే నేను ఆ విధంగా ఆ రోజు మాట్లాడాను. ఇలాంటి విష‌యాలు మాట్లాడేట‌ప్పుడు నేను సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు అని చెప్పేందుకు, మీ కుటుంబం ఉన్న‌తికి జీవ‌న ప్రమాణం పెంపుద‌ల‌కు ఎవ‌రు కృషి చేస్తున్నారో గుర్తించాల‌ని, ఇంత‌టి మంచి జీవితం ఇచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీరంద‌రి క‌న్నా గొప్ప‌వాడు క‌దా అన్న ఉద్దేశంతో అన్నానే కానీ నాకు వారెవ్వ‌రిపై చిన్న చూపు లేదు. వారంటే నాకు ఏ చెడు అభిప్రాయం లేదు. ఏదేమ‌యినా ప్ర‌భుత్వాలు న‌డిపే వారి ధోర‌ణి ఏంటి ? వారి భావ జాలం ఏంటి అన్న‌వి తెలుసుకోవాల‌ని కోరుకుంటున్నా. ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధులుగా ఉండ‌డం అన్న‌ది డ‌బ్బు సంపాదించే ప‌ని కాదు. నిజాయితీగా ఉంటేనే జీవితం సంతృప్తిక‌రంగా ఉంటుంది. నిజాయితీతో కూడిన ఉద్యోగ ధ‌ర్మ నిర్వ‌హ‌ణ అన్న‌ది ప్రామాణికం అయితేనే జీవితం సంతృప్తిక‌రంగా ఉంటుంది అని విన్న‌విస్తూ ఉన్నాను." 

చంద్ర‌బాబు బాదుడే బాదుడు అంటూ ఊరురా 
తిరుగుతున్నార‌ని కానీ టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో అన్న‌ది చెప్ప‌లేక‌పోతున్నారు. ధ‌ర‌ల‌కు సంబంధించి అస‌త్య ప్ర‌చారం నిర్వహిస్తోంది. ఒక్క‌సారి ధ‌ర‌ల విష‌య‌మై పొరుగు రాష్ట్రాల‌తో పోల్చి చూడండి. అక్క‌డ ఏ మేర‌కు ధ‌ర‌లున్నాయో ఒక్క‌సారి అడిగి చూడండి. 
మ‌న దేశానికి అవ‌స‌రం అయ్యే వంట నూనెల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఫారెన్ ఎక్సైంజ్ ద్వారానే ఇవ‌న్నీ 
సాధ్యం అవుతాయి. ధ‌ర‌లు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిందేమీ లేదు. అదేవిధంగా పెట్రో, డీజిలు రేట్లు దేశ‌మంత‌టా పెరుగుతున్నాయి. ఇవి కూడా బ‌య‌ట నుంచి వ‌చ్చేవే. ఈ ధ‌ర‌లు కూడా ఒక్క‌సారి మిగ‌తా ప్రాంతాల‌తో పోల్చి చూడండి. మాకు ఓటేసినా వేయ‌క‌పోయినా అన్ని కుటుంబాల‌కూ అన్నీ వ‌ర్తింప జేస్తున్నాం. అంటే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో వివ‌క్ష‌కు తావే లేదు.

వంశధార గొట్టా వద్ద ఎత్తిపోతల పథకం వచ్చే ఆగస్టు లోగా పూర్తి 19 టీఎంసీల నీటి వినియోగానికి చర్యలు. తద్వారా జిల్లాలోమూడు పంటలు పండిచేందుకు అవకాశం ఉంటుంది.  గార నుంచి వనిత మండలానికి వంశధార నది పై నిర్మిస్తున్న వంతెనను త్వరలో పూర్తి చేస్తాం అని అన్నారు.

కార్య‌క్ర‌మంలో  తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు మార్పు సుజాత, కార్పొరేషన్ డైరెక్టర్లు ముంజేటి కృష్ణ, సుగ్గు లక్ష్మీ, వైస్ ఎంపీపీ బరాటం రామశేషు,  ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గోండు కృష్ణ, సర్పంచులు మార్పు పృధ్వి, పీస గోపి, పీస శ్రీహరి, కొయ్యాన నాగభూషణ్‌, అరవల రామ కృష్ణ, యల్లా నారాయణ, ఎంపీటీసీలు, అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Back to Top