తాడేపల్లి: వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెర తీస్తూ, చేపట్టిన మెడికల్ కాలేజీల్లో, తొలి విడతగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, సెప్టెంబరు 15న నాటి సీఎం వైయస్ జగన్ విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన ఆ కాలేజీతో పాటు, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను కూడా విజయనగరం నుంచే ఆనాడు వైయస్ జగన్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయా కాలేజీల వద్ద వైయస్ఆర్సీపీ నాయకులు సోమవారం నాడు కేక్ కట్ చేసి ఆ అద్భుత ఘట్టాన్ని ప్రస్తావించారు. ఇటు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన పార్టీ నేతలు, నాయకులు వైద్య విద్యలో కీలకంగా నిల్చిన మెడికల్ కాలేజీల ప్రారంభాన్ని గుర్తు చేశారు. వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు, పార్టీ నాయకులు కొమ్మూరి కనకారావు, అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, కొండా రాజీవ్, పుత్తా శివశంకర్, షరీఫ్, పానుగంటి చైతన్య, రవిచంద్ర, కె.సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.