ప్రాంతాల వారీగా అలజడి సృష్టించేందుకే బాబు కుట్ర

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  టీజేఆర్ సుధాకర్ బాబు 
  
 మీది మహా యాత్ర కాదు..  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై దాడి

 బాబు బినామీలకు మేలు చేసేందుకే అమరావతి ఉద్యమం

  తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్రబాబు నాయుడు విష కౌగిలిలో, అమాయకులైన రైతులు చిక్కుకుపోయి విలవిలలాడుతున్నార‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు.  పైపెచ్చు రైతుల పేరుతో మహా పాదయాత్రను ప్రారంభించి రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అల‌జ‌డి సృష్టించేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  ఇటువంటి యాత్రలు, ఉద్యమాలు చేయిస్తున్నందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు సిగ్గుపడాల‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  

- అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి, సమన్యాయం జరగాలనే బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన చంద్రబాబు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ఈ వాదం.. ప్రకాశం జిల్లాకు చేరుకుంది. అసలు ఈ పాదయాత్ర ద్వారా ఏం జరుగుతుందనే విషయాన్ని మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ రోజుంతా ప్రత్యక్షంగా చూసి, రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మీడియా ముందుకు రావడం జరిగింది.
- గత మూడు రోజుల నుంచి ప్రకాశం జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర పూర్తిగా పసుపుమయం అయింది. గుంటూరు నుంచి ఆలపాటి రాజా, అద్దంకి నుంచి గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, దామరచర్ల జనార్థన్ వీళ్లంతా పాదయాత్రలో పాల్గొన్నారు. షెడ్యూల్‌ క్యాస్ట్‌కు కేటాయించిన సంతనూతలపాడు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. షెడ్యూల్‌ కులాలకు చెందిన నియోజకవర్గంలో ఏమి అరాచకాలు సృష్టించాలని, కులాలు, మతాల మధ్య ఎటువంటి చిచ్చు పెట్టాలని ఈ నలుగురు... బయట నియోజకవర్గాల నుంచి జనాలను తోలారు?  మా నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం నుంచి పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదు.

 అయ్యా...  మాకు మూడు రాజధానులు కావాలని, మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, మా భూములకు విలువలు పెరగాలని, మా బిడ్డలు కూడా అభివృద్ధి చెంది, మా తరాలు కూడా ముందుకు పోవాలని రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన, మైనార్టీ, వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీలకు, వారి బినామీ భూములకు ధరలు కల్పించి, మేలు చేసే కార్యక్రమం మాత్రమే చేస్తున్నారు.

 అమరావతి రైతులకు దండం పెట్టి చెబుతున్నా. దయచేసి కళ్లు తెరవండి. వాస్తవాలేమిటో, మీకు తెలుసు, మాకు తెలుసు... మన అందరికీ తెలుసు. మన భూముల్ని చంద్రబాబు నాయుడు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో వచ్చి, సారవంతమైన అమరావతి భూములను బలవంతంగా ఎలా బెదిరించి, దౌర్జన్యంగా లాగేసుకున్నాడో. ఇదంతా పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలాగా జరిగిందనే సత్యం మనందరికీ తెలుసు.
    1- చంద్రబాబు తన బినామీ భూముల కోసం ఆరాటపడుతుంటే... మాది పేద ప్రజల కోసం సంబంధించి ఆరాటం.
    2- ఆయన కులగజ్జితో పోరాటం చేస్తుంటే... మాది సామాజిక న్యాయం కోసం చేసే పోరాటం.
    3- చంద్రబాబు దోపిడీదారుల కోసం పోరాటం చేస్తుంటే.. దోపిడీకి బలైన వర్గాల కోసం మా పోరాటం సాగుతోంది.
    4- మీది బాబు భూముల కోసం పోరాటం అయితే.. మాది బహుజన భూముల కోసం పోరాటం.
    5- భూముల ధరల కోసం మీ పోరాటమైతే ... మాది భూమి కోసం, భుక్తికోసం, కడుపు కాలినవాడి కోసం చేస్తున్న పోరాటం.
    6- మీరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పోరాటం చేస్తుంటే... మాది అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరిపించే పోరాటం.
    7- మీరు బెంజ్‌ కార్లు, యాపిల్‌ ఫోన్లతో పోరాటం చేస్తుంటే.. మాది ప్రజా సంకల్పం కోసం పేదవాళ్లు, దళితులు, బలహీనవర్గాల కోసం చేస్తున్న పోరాటం.
    8- మీది కెమెరాల కోసం చేసే పోరాటం అయితే ... మాది ప్రజల బాగు కోసం చేస్తున్న మహా యజ్ఞం.
    9- మీది రియల్‌ ఎస్టేట్‌ కోసం పోరాటం అయితే... మాది స్టేట్‌ కోసం పోరాటం.
 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారి సుపరిపాలనలో దండిగా, గుండెల నిండా ప్రేమతో ఆప్యాయతతో నిండిన ప్రజానీకం... అమరావతి రాజధాని ప్రాంతంలోనే గుంటూరు, విజయవాడ మున్సిపాల్టీలను వైయస్సార్‌ సీపీ హస్తగతం చేశారు. ఇంకా చంద్రబాబుకు సిగ్గు రాకపోవడం దురదృష్టకరం.

 చంద్రబాబు వద్దని... జగన్‌గారే ముఖ్యమంత్రి కావాలని ఆయన ద్వారానే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 51శాతం మంది ప్రజలు భావించి ఓటేస్తే...  151మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలంతా ఏకమై ప్రజాస్వామ్యబద్ధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే.. మీ కుట్ర రాజకీయాలకు ఈరోజు మా తీర్పు అంటరానిది అయిపోయిందా...? మా ఓటు అంటరానిది అయిపోయిందా? మా నిర్ణయం అంటరానిదైపోయిందా?. 80 శాతంకు పైగా ఉన్న బడుగు,  బలహీనవర్గాలమైన మా బతుకులు ఎప్పటికీ అంటరానివిగా ఉండాలన్నదే చంద్రబాబు కోరిక, ఆలోచన, సిద్ధాంతం, తలంపు కాబట్టే... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమరావతిలో భూములు ఇచ్చేందుకు జగన్‌గారు ముందుకు వస్తే... ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వీరికి ఇళ్లపట్టాలు ఇస్తే డెమెగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్‌ వస్తుందంటూ ప్రకటించారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటే సామాజిక అసమతుల్యత వస్తుందా..?
-  మరి అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్నది ఏ రైతులు, ఎవరికోసం చేస్తున్నారు? ఏ ప్రాంతంలో చేస్తున్నారు? ఏ ప్రాంతం నుంచి వారికి మద్దతు వచ్చింది? ఎందుకు అలజడులు సృష్టిస్తున్నారు? ఏ సామాజిక వర్గాల మీద దాడి జరగబోతుంది. ఎందుకు ఇంకా మమ్మల్ని అంటరానివాళ్లలాగా చూస్తూ అవమానపరుస్తున్నారు?  

 మా ప్రాంతాలకు వచ్చి లేని ఉద్యమాలు, లేని అలజడులు సృష్టించి, రెచ్చగొట్టి, ప్రజలను లాఠీలతో కొట్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో జరిగిన చిన్న ఘటనను వీడియో క్లిప్పింగ్‌లతో ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. అసలు 157మంది చేసే పాదయాత్రకు గొట్టిపాటి రవి, ఆలపాటి రాజా, దామరచర్ల జనార్థన్‌కు సంబంధం ఏంటి? సంఘీభావం తెలపాల్పింది నాగులుప్పలపాడు ప్రజలు కదా? మా నియోజకవర్గాల్లో మీకేంటి పని? మీరు ఏం చేసినా పడతామని, కళ్లు అప్పగించి చూస్తామని, అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

  గుంటూరులో మొదలుపెట్టిన మీ పాదయాత్ర చిత్తూరు వరకూ వెళుతుంది. చిత్తూరు రాయలసీమ ప్రాంతం. మరి సీమ న్యాయ రాజధాని ఇద్దామన్న ముఖ్యమంత్రిగారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ మీద దండయాత్ర చేస్తున్నారా చంద్రబాబూ. రాయలసీమ ప్రజల మనోభావాలకు విఘాతం కల్పిస్తూ, అలజడులు సృష్టించి.. దాడికి వెళుతున్నారా.?. పరిపాలన రాజధాని విశాఖలో పెడదామంటే, న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ  నిర్మాణాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. మీ లక్ష్యం, మీ బినామీల ప్రాంతంలో, తుళ్లురులో మాత్రమే రాజధాని, పరిపాలన ఉండాలనుకోవడమే కదా? 19 గ్రామాలకు మాత్రమే నాయకుడిని అని అనుకుంటున్నావు కాబట్టే మీ కొడుకును మంగళగిరి ప్రజలు చిత్తుగా ఓడించినా మీకు సిగ్గు రాలేదు.  ప్రజాస్వామ్య వాదులకు చంద్రబాబు పూర్తిగా దూరం అయ్యాడు. మీకు సంబంధించిన కార్పొరేట్‌ సెక్టార్‌ విష కౌగిలిని ఈ రాష్ట్రానికి చుట్టి,  మీరే దోచుకుతినాలని, మీ మీడియా సంస్థలే బతకాలని, మీవాళ్లే ఉండాలని, మీరే పెత్తనం చేయాలనే కుట్రపూరిత రాజకీయానికి పరాకాష్టే ఈవాళ జరుగుతున్న పాదయాత్ర. అందుకే ప్రకాశం జిల్లా మీద దాడి చేస్తున్నార‌ని సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు.

Back to Top