అడగకుండానే దళితులకు 50% రిజర్వేషన్లు ఇచ్చిన మనసు సీఎం జగన్‌ది

జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే
 

ఎస్సీ కమీషన్ ఎస్టీ కమీషన్ రెండిటినీ సపరేట్ చేస్తూ చట్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రిగారికీ కృతజ్ఞతలు. ఎస్సీ ఎస్టీలు తెలుగుదేశం ప్రభుత్వంలో వృద్ధి చెందారని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసారు. ఎప్పుడూ లేనట్టుగా ఎస్టీ అభ్యర్థి లేని కాబినెట్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్. మంత్రి వర్గంలో ఎస్టీలు లేకుండా ఐదేళ్లు మీరు పాలన చేసి, ఎస్సీఎస్టీలను ఉద్ధరించానని ఈ సభ సాక్షిగా చెప్పడం సిగ్గుచేటు. సాక్ష్యాత్తు నాటి ముఖ్యమంత్రి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని నీచంగా మాట్లాడాడు. అలాంటి మీరు ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే అర్హతలేదు. నిజంగా టీడీపీ ఎస్టీలకు మేలు చేసింది నిజమే అయితే ఒక్క సీటైనా గెలిచుండేవారుగా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నేడు చట్టసభలో ఉన్నారు. మేము పోరాటాలు చేస్తే కాదు, మా అంతరాత్మ, మా మదిలో ఉన్న ఆలోచనలు, మా అభిలాష, మేం పడుతున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ తెలుసుకుని, మా వర్గాల ప్రజల ఉన్నతి కోసం నేడు చేస్తున్న చట్టాలివి. 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో కల్పించమని మా వర్గాలెవ్వరం వైయస్ జగన్‌ను అడగలేదు. ముఖ్యమంత్రిగారే స్వయంగా 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి గ్రామం తిరుగుతూ, ప్రతి వర్గాన్నీ, కులాన్నీ, మతాన్ని వాళ్ల బాధలు కష్టాలు ఏంటని తెలుసుకుంటూ, రాజకీయంగా, ఆర్థికంగా పడుతున్న బాధలు తెలుసుకుని ఇప్పుడీ చట్టాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారు.
చిన్న ఉదాహరణ చెబుతాను. మా జిల్లాలో ఒక్క మార్కెట్ యార్డు ఛైర్మన్ కావాలంటే తల్లకిందులుగా తపస్సు చేసినా అయ్యేవాళ్లం కాదు. ఈ ప్రభుత్వంలో 19 మార్కెట్ యార్డులుంటే 10 మార్కెట్ యార్డుల్లో అవకాశాన్ని మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఒక చట్టం చేసేసి మాకందించారు. రాష్ట్రంలో మొత్తం 215 మార్కెట్ యార్డులుంటే సుమారు 110మంది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఛైర్మన్లు అవుతున్నారు. 2500 డైరెక్టర్ పదవులుంటే 1300 మంది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు డైరెక్టర్లు అవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లల్లో ఇతర దేశాల్లో ఊరికి ఒకరుంటే గొప్ప. అదే అగ్ర వర్ణాల పిల్లలు ఇంటికొకరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో  ఉంటారు. ఆ అసమానతలు తొలగించి, ఈరోజు మాపిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే మా పిల్లలు కూడా విదేశాలకు వెళ్తారు. మంచి చట్టాన్ని తెచ్చి, ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవేశ పెడుతుంటే టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోంది. 

 

Back to Top