తూర్పుగోదావరి జిల్లా: మా కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడో అర్థం కావడం లేదని వైయస్ఆర్సీపీ నేత, తంబాలపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు కలిశారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ..`కోర్టులో ఆర్డర్ ఇచ్చినా.. అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుంది. టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, కూటమి ప్రభుత్వం మాపై ఇలాంటి వేధింపులు మంచిది కాదు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారు. ములాఖత్ లో సైతం పక్కనే పోలీసులు ఉంటున్నారు. ఏ తప్పు చేయని మనిషిని దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారు. శత్రువుకు కూడా ఇటువంటి పరిస్థితి కాకూడదు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్ళం. మాపై కక్ష సాధించే వాళ్ళను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టటం ప్రభుత్వానికి మంచిది కాదు. చార్జ్ షీట్లో కూడా మిథున్ రెడ్డి పేరు లేదు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్ రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.. మేము వెళ్ళినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా...తమకు రాలేదు, అందలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అరెస్టు చేయటానికి ఒక్క ఆధారం దొరకలేదు... ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు` అని ద్వారకనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నా: మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్రాజు విమర్శించారు. వైయస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలపై కేసులు పెట్టి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ పోకడ రాష్ట్రంలో అమలవుతుందన్నారు. అధికారంతో అణచి వేస్తామనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తుందని తప్పుబట్టారు. ఇలాంటి పోకడల తోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు.