ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నవశకం మొదలైంది

త్వరలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం ప్రారంభిస్తారు

దళితులను అవమానించి, దాడులు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుది

అంబేడ్కర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగు నాగార్జున

విజయవాడ: స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిశీలించారు. ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, రూ.420 కోట్లతో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఓ చారిత్రాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావించారని, అందుకు తగ్గట్టుగానే నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. 

లోకేష్‌పై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్‌ అయ్యారు. లోకేష్‌ ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిచాడా..? అని ప్రశ్నించారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటూ దళితులను అవమానించేలా చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పెట్టాలని చూశాడని, దళితులను అవమానించి, దాడులు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. చంద్రబాబుకు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అంబేడ్కర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. ఐదేళ్ల పాలనలో  చంద్రబాబు దళితులను మోసం చేశాడని మండిపడ్డారు. తమకు సమవుజ్జీకానీ లోకేష్‌కు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

అనంత‌రం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడూతూ.. భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేడ్క‌ర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. అంబేడ్క‌ర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుంద‌ని వివ‌రించారు. అంబేడ్క‌ర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని,  దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నార‌ని చెప్పారు. విజయ‌వాడ నడిబొడ్డున అంబేడ్క‌ర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు. 

Back to Top