బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించలేం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్‌ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకున్న పక్షంలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్‌ కల్పించాలంటూ దేశం వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నట్లుగా ఆమె తెలిపారు.

 ఏపీలో మూడు రూర్బన్‌ మిషన్‌ క్లస్టర్ల అభివృద్ధి
  ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ మిషన్‌ కింద 21 విభాగాలలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.
గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్‌ ప్రాసెసింగ్‌, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో ఉపాధి కల్పన, ఆరోగ్య, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం గ్రామాలకు పైపులతో త్రాగు నీటి వసతి కల్పించడం, గ్రామీణ గృహ నిర్మాణం, ప్రజా రవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వీధి దీపాల ఏర్పాటు వంటి ఇత్యాది ప్రాజెక్ట్‌లను అరకులోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 

Back to Top