విజయవాడ: గతంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ లు పవన్ కల్యాణ్ ఒక్కరే చదివేవారని, ఇప్పుడు పవన్ కల్యాణ్కు బీజేపీ నేతలు తోడయ్యారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నేతలు నడుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఏపీ బీజేపీలో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు, కడపకు స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇస్తామని చెప్పే సత్తా సోము వీర్రాజు, జీవీఎల్కు ఉందా?. బీజేపీ నేతలు కపట నాటకాలాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి, సీఎం రమేష్లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని.. ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడినా సీఎం వైయస్ జగన్ ఏపీని అభివృద్ధి చేసి తీరతారన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చదవొద్దని ఏపీ బీజేపీ నేతలకు మంత్రి హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇలాగే కొనసాగితే బీజేపీ మరింత హీనంగా తయారవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.