విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు రాజకీయ విలువలు లేవని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ ట్విట్టర్ మాస్టర్.. ఆయన కోసమే తాపత్రయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ల గ్యాప్లో ట్వీట్ చేస్తూ ప్రజల్లో ఉన్నానని అనుకుంటున్నారని తప్పుపట్టారు. పవన్కు చంద్రబాబును నిలబెట్టుకోవాలని తాపత్రయ పడుతున్నాడన్నారు. తమ సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వెళ్తే ప్రజల్లో ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్తు ద్వారా 5 ఆలయాలకు పాలక వర్గాల నియామకం చేసినట్లు తెలిపారు. 25 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాలకు పాలక మండళ్లు నియమించామన్నారు. రాష్ట్రంలోని మఠంలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం 20 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వరూపానంద ఉద్యోగులు గొడవలు పడవద్దని సూచించారు. ఉద్యోగులు కోర్టులకు వెళ్లడం వల్ల ప్రమోషన్లు ఆగిపోతున్నాయని స్వరూపానంద పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ అలయంలో కూడా టిక్కెట్ ధరలు పెంచలేదని ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ వివరించారు. అమరావతి రైతుల పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్లు ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు పాల్గొంటున్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.