చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

మంత్రి కన్నబాబు

ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నాం

అమరావతి: అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు ట్వీట్‌ చేశారని మండిపడ్డారు.  రైతులకు మద్దతు ధరకు ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు తమకు అప్పగించారని అన్నారు.  చివరకు, చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా ‘పసుపు-కుంకుమ’ పథకానికి  మళ్లించారని, అటువంటి పరిస్థితుల్లో వున్న ఖజానాను తమ ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. అయినప్పటికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ‘రైతు భరోసా’ కోసం మిగతా పథకాలు ఆగిపోయాయని, డబ్బులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు పచ్చి అబద్ధం అని అన్నారు.

అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడు ఈరోజున బోనులో నిలబడే పరిస్థితి అని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలు బలికాకూడదని చెప్పి ఆయన హయాంలో మొక్కజొన్న రైతులకు ఇచ్చిన హామీని వైయస్‌ జగన్ అమలు చేశారని అన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం అంకెల గారడీ ప్రభుత్వం కాదని, వ్యవసాయ శాఖను రైతులకు చేరువ చేస్తున్నామని అన్నారు.

Read Also: రేపటి నుంచి ‘నవశకం’ ప్రారంభం

Back to Top