అసెంబ్లీ: ఓవైపు రైతు సంక్షేమం.. మరోవైపు సంస్కరణలు చేపడుతూ రైతు ముఖంలో సంతృప్తిని చూడడం కోసం వైయస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు సంక్షేమం అంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని, రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తానని సీఎం వైయస్ జగన్ ఆనాడే ప్రకటించారని, చెప్పిన మాటలను నిజం చేస్తూ ముందుకుసాగుతున్నారన్నారు. ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక నమూనాగా తయారు చేస్తానని చెప్పారు. ఆనాడు చెప్పిన మాటలు నేడు నిజం అవుతున్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు రైతులకు అందించేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర సీఎం వైయస్ జగన్ చూసిన రైతుల కష్టాలు, కన్నీరు తుడిచే విధంగా కార్యాచరణ మొదలైందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2020–21 వార్షిక బడ్జెట్ను మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతేడాదిలో రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. నవరత్నాల్లో మొదటిది రైతు భరోసా– పీఎం కిసాన్ పెట్టుబడి సాయం రైతు భరోసా పథకంలో చెప్పిన దానికంటే ముందుగా.. మాటిచ్చినదానికంటే మిన్నగా రైతు, కౌలురైతుల కుటుంబాలకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఏడాదికి రూ. 12500 అని చెప్పి.. దాన్ని రూ.13500 పెంచి గత సంవత్సరంలో మూడు విడతలుగా 46.69 లక్షల రైతుల కుటుంబాలకు రూ.6534.07 కోట్లు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా రెండవ ఏడాది 2020–21 సంవత్సరంలో మే 15వ తేదీన రెండవ ఏడాదికి సంబంధించి 49.43 లక్షల రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3675.25 కోట్ల సాయం అందించడం జరిగింది. మొత్తంగా చూస్తే.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నేరుగా అందించిన సాయం రూ.10,209.32 కోట్లు. సీజన్కు ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించడం రైతులకు పెద్ద ఊరట. కౌలు రైతులకు సాయం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించి రైతు పక్షపాతిని అని సీఎం నిరూపించుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుచట్టం – 2019 తీసుకొచ్చి కౌలుకు భూములిచ్చే భూ యజమానుల హక్కుల భంగం కలగకుండా.. కౌలు దారులకు పంటపై మాత్రమే హక్కు కల్పించే విధంగా తీసుకువచ్చిన కట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. కౌలు రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే 2019–20 సంవత్సరానికి రూ.213.47 కోట్లు 10.58 లక్షల కౌలురైతు కుటుంబాలకు సాయం అందించాం. మొత్తం ఈ పథకం కింద 2020–21 బడ్జెట్లో రూ.6885.69 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. లాక్డౌన్లోనూ వ్యవసాయ శాఖపై రోజూ సమీక్ష లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిరోజూ వైద్య, ఆరోగ్య రంగాన్ని ప్రతి రోజూ ఏ విధంగా సమీక్షించారో.. అదే విధంగా వ్యవసాయ రంగాన్ని కూడా సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత భారం పడినా రైతులకు గిట్టుబాటు ధర లభించాల్సిందే అనేది సీఎం ధృడ సంకల్పం. రబీ సీజన్లో వివిధ పంటల ఉత్పత్తులు చేతికి వస్తున్న సమయంలో దేశంలో, మన రాష్ట్రంలో అన్ని మార్కెట్లు మూతపడినా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఇచ్చిన మాట ప్రకారం గత బడ్జెట్లో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేశాం. చరిత్రలో తొలిసారిగా నిల్వ చేయడానికి వీలుకాని పంటలను కొనుగోలు చేశాం. ఆ విధంగా అరటి 12 వేల టన్నులు, బత్తాయి 4112 టన్నులు, టమాటాలు 1425 టన్నులు, బజ్జీ మిరప, బూడిదగుమ్మడికాయ, పూలు కొనుగోలు చేశాం. వాటిని రైతు బజార్లు, మార్కెట్ కమిటీల ద్వారా విక్రయించాం. అంతేకాకుండా మార్క్ఫెడ్ ద్వారా జొన్న 1.04 లక్షల టన్నులు, మొక్కజొన్న 3.65 లక్షల టన్నులు, శనగలు 1.71 లక్షల టన్నులు, పసుపు 20,724 టన్నులు, కందులు 57,018 టన్నులు, ఉల్లిపాయలు 957 టన్నుల ఉత్పత్తులను రూ.2,215 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాం. పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల పొలాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి నమోదు చేసుకుంటే చాలు రైతు వద్దకు వచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 30.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ సీజన్లో కొనుగోలు చేయడం జరిగింది. వచ్చే సీజన్ నుంచి మొక్కజొన్న తదితర పంటలను కూడా రైతుల వద్దకు వెళ్లి ఈ విధానం ద్వారా కొనుగోలు చేయనున్నాం. శాశ్వత సేకరణ కేంద్రాలు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు నూతన విధానాన్ని జనవరి 2020 నుంచి తీసుకువచ్చాం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం 196 మార్కెట్ యార్డులను, 120 సబ్ యార్డులను శాశ్వత సేకరణ కేంద్రాలుగా ప్రకటించాం. మార్కెట్ కమిటీల పెంపు విత్తనం వేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించాలనే సీఎం వైయస్ జగన్ సంచలన సంకల్పాన్ని నెరవేర్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. రైతు భరోసా కేంద్రాలు ఇకపై పంటల కొనుగోలు కేంద్రాలుగా తమ సేవలను అందిస్తాయి. గ్రామ స్థాయికి మార్కెటింగ్ వ్యవస్థను తీసుకెళ్లాం. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధితో అనుసంధానం చేశాం. 191 వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఖ్యను 216కు పెంచాం. రూ.200 కోట్లతో కోల్డ్స్టోరేజీలు, గోదాముల నిర్మాణం అన్ని మార్కెట్ యార్డులను ఈ ఏడాది నుంచే నవీకరించనున్నాం. వీటితో పాటు కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. దీనికి రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఇవేకాకుండా గ్రామాల్లో, మండలాల్లో కోల్డ్ స్టోరేజీ, గోదాముల నిర్మాణాలను మ్యాపింగ్ చేస్తున్నాం. మార్కెట్ కమిటీల్లో 50 శాతం మహిళలే.. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఏఎంసీ అధ్యక్షుల నియామకంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీంతో 108 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు చైర్పర్సన్లుగా ఏకైక రాష్ట్రం మనదని చెప్పడానికి గర్వపడుతున్నాం. మార్కెట్ వ్యవస్థ ఆధునీకరణ మార్కెట్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా మధ్యవర్తులు, దళారీల ప్రభావం తగ్గించడానికి కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను సంస్కరించడానికి ముందుకు సాగుతున్నాం. కమీషన్దారులను, దళారులను నియంత్రించడానికి ఈ ఏడాది చట్టం తీసుకువస్తున్నాం. రైతులు లబ్ధిపొందేలా.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక వసతులు కల్పనపై ప్రత్యేకించి మార్కెటింగ్ వ్యవస్థను పట్టిష్టపరిచే దిశగా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. వినియోగదారులు, రైతులు లబ్ధిపొందేలా ఉభయసారకంగా నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో 101 రైతు బజార్లతో పాటు 430 వికేంద్రీకృత రైతు బజార్లను ఏర్పాటు చేశాం. ఈఏడాది తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉల్లి ధరలు పెరిగిన సందర్భంగా వినియోగదారులకు మేలు చేసేలా ఇతర రాష్ట్రాల నుంచి 80,522 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కిలో రూ.25కు విక్రయించాం. ఇందుకు రూ.63.12 కోట్లు ఖర్చు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు, మిరప, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు తొలిసారిగా ఎంఎస్పీ ప్రకటించాం. మార్కెటింగ్ ఇంటెలీజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. సీఎం యాప్ తీసుకొచ్చి పంటల వివరాలను తెలుసుకుంటున్నాం. ధరల స్థిరీకరణ నిధి కింద 2020–21 బడ్జెట్లో రూ.3 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నాను. 10,641 రైతు భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించారు. ఇందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభిస్తాయి. ధాన్యం కొనుగోలు కూడా జరుగుతుంది.