గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించాం

అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం

ఎస్ఈజెడ్‌లో ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి అమ‌ర్‌నాథ్‌

విశాఖ‌: అచ్చుత్యాపురం గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించామ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ చెప్పారు. ఎస్ఈజెడ్‌లో ప్రమాద ప్రాంతాన్ని ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతితో క‌లిసి మంత్రి అమ‌ర్‌నాథ్ ప‌రిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అమ‌ర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామ‌ని చెప్పారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారని, వారికి మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తున్నామ‌ని వివ‌రించారు. విష వాయువులు ఎక్క‌డ నుంచి వచ్చాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంద‌న్నారు.  ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌న్నారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింద‌ని, వారికి మంచి వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించామ‌న్నారు. గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నార‌ని, ప‌లువురు ఇళ్ల‌కు కూడా వెళ్లిపోయార‌ని చెప్పారు. 

Back to Top