విశాఖ: తాటాకు చప్పుళ్లకి భయపడే వారు లేరిక్కడ అని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. వీళ్ల ప్రభుత్వం వస్తుందట..ఏదో చేస్తారట..నిద్రలో కలలు కనండి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: వాళ్లేం మాట్లాడారో, సభ ఎందుకు పెట్టారో వారికే తెలియదు: భారీ అంటే అర్ధం ఏంటి..? భారీ బహిరంగ సభ జరిగిందా? లక్షలాది మంది వచ్చారా? దాన్ని మేం ఎందుకు అడ్డుకుంటాం. మేం ఇంకా మా పోలీసులను పెట్టి ఏమీ ఇబ్బంది లేకుండా చేశాం. ఏయూ గ్రౌండ్ అడిగితే ఇవ్వలేదా? అది నా దృష్టికి రాలేదు. నేనే సంబంధిత మంత్రిని. గతంలో ప్రధాని నరేంద్రమోడీ గారి మీటింగుకు కూడా ఇచ్చాం. వాళ్లేం మాట్లాడారో, సభ ఎందుకు పెట్టారో, దాని ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ తెలియదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం చేశారో తెలియదు. ఆయన తనయుడు ఏదేదో చెప్తూ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు రెడ్ బుక్ అంటున్నాడో ప్రజలకే అర్ధం కావడం లేదు. రాజకీయాల్లో రెడ్ బుక్ కాదు..బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ చట్టప్రకారం, నిబంధనల మేరకు నడవాలి. హోప్లెస్ మాటలు ఎవరూ మాట్లాడరు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? రాచరికమా? మేం చట్టప్రకారం ఏం చేయలేదో వారు చెప్పాలి. ఆయన పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నామో చెప్పండి. వాళ్లకి వారు ఊహించుకుని..బుడ్డొడ్డు..పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? జగన్ గారు పాదయాత్ర చేశారు. నేను కూడా వెళ్లి పోలీసుల వద్దకు వెళ్లి రిక్వెస్ట్ ఇచ్చాం. వారు కొన్ని నిబంధనలు ఇచ్చారు. వాటిని మేం ఎక్కడ డీవియేట్ కాలేదు. అందుకే సాఫీగా సాగింది. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చేస్తే ఎక్కడా సమస్య రాదు.. పుంగనూరులో చంద్రబాబు గొడవ ఎందుకు జరిగింది.? ఇచ్చిన రూట్ వేరు..వెళ్లిన రూట్ వేరు. అక్కడున్న స్థానికులను నిందించడం వల్లే కదా గొడవ జరిగింది. రాజకీయంగా రాజకీయ ఉపన్యాసం ఇచ్చుకోవాలి కానీ నీ ఇంటి వద్దకు వచ్చి నిన్ను తిడతాను అంటే ఊరుకుంటారా? దానికి మళ్లీ ప్రభుత్వాన్ని, పోలీసులను నిందిస్తాం..రెడ్ బుక్ అంటే ఎలా..? తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరిక్కడ..!: – తాటాకు చప్పుళ్లకి భయపడే వారు లేరిక్కడ. వీళ్ల ప్రభుత్వం వస్తుందట..ఏదో చేస్తారట..నిద్రలో కలలు కనమనండి. – ఎందుకు మా ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లేయరు..? మేం ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. – చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏమైనా అమలు జరిపాడా? – మహిళకు, రైతులకు రుణమాఫీ అన్నాడు..చేశాడా..? – బాబు వస్తే జాబు..లేదంటే 2వేల భృతి అన్నాడు..చేశాడా..? – అందుకే ప్రజలు ఛీ కొట్టారు...తిరస్కరించారు..పొమ్మన్నారు. – మళ్లీ ఇప్పుడు తానేదో శుద్ధుడిని అయ్యాయని చెప్పుకుంటున్నాడు. – నిన్నేదే ఆయనపై పుస్తకం రాసినట్లున్నారు. మనసులో మాట పుస్తకం కూడా పెడితే బాగుండేది. 2014లో కలిసినప్పుడు అప్పుడు చారిత్రక ఘట్టం కాదా?: – పవన్ కల్యాణ్ సెలబ్రిటీ గురించి నేను మాట్లాడాల్సి రావడం హాస్యాస్పదం. – టీడీపీ, జనసేన కలవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అట..చారిత్రక అవసరం అట. – 2014లో వాళ్లు కలిసి ఎందుకు పోటీ చేశారు..? బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. – ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అప్పుడు చారిత్రాత్మక అవసరం, ఘట్టం కాదా? – ఈ నిలదీయడాలు, చొక్కాలు పట్టుకుని ప్రశ్నించడాలు అప్పుడేమయ్యాయి? – మోడీ, పవన్, చంద్రబాబు ఫోటోలతోనే ఆనాడు మేనిఫెస్టోను ఇచ్చారు. – ఇప్పుడు కొత్తగా కలిశారా? ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుని మళ్లీ కొత్తగా కలిశారు. – మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి..కలహాలు వచ్చాయి..మళ్లీ ఇప్పుడు కలిసిపోయారు. వాళ్లని ఎవరు నమ్ముతారు..? – రాజకీయ అవసరాల కోసం ఎవరు కలుస్తారో..ఎవరు విడిపోతారో మాకు అనవసరం. – ఒక సారి కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారు..ప్రజలకు అన్యాయం చేశారు. – మళ్లీ ఈ దొంగల ముఠా వస్తోంది..నమ్మవద్దని మేం ప్రజలను అప్పీలు చేస్తున్నాం. – రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరు కలుస్తారు..ఒకరు విడిపోతారు..దాంతో మాకేం సంబంధం..? – మేం మాత్రం ప్రజలకు జవాబుదారులం. ఎన్నికలలో ఏం మాటిచ్చామో అవి అమలు చేసి చూపిస్తాం. విశాఖకు రావడానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో చూస్తున్నారుగా..?: – ఒక మహా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు దాన్ని భగ్నం చేయాలనుకోవడం చూస్తూనే ఉన్నారు. – విశాఖకు ముఖ్యమంత్రి గారు రావడాన్ని కూడా మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. – ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు కల్పిస్తున్నారు..ఎంత ఎగతాళి చేస్తున్నారు..? – ఏంటి మూడు ముక్కలాట..? లాండ్ పూలింగ్ అని అమరావతిలో వేల కోట్లు దోచేద్దామని చూసి తగుదునమ్మ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. – చంద్రబాబు ఉంటే 2020లోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ కట్టేవాడట..? ఆ మాట వింటే నాకు సిగ్గేస్తుంది. – గెంతలేనమ్మ మద్దెల సరిగ్గా వాయించలేదని గెంతలేకపోయాను అన్నదట. – ఆనాడు అశోక్గజపతిరాజు విమానయాన మంత్రి. ఆ రోజు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వేసింది. ఎల్ 1 వచ్చింది. – దాన్ని ఏ స్వార్ధంతో క్యాన్సిల్ చేశారు..? మళ్లీ ఈ రోజు మాట్లాడుతున్నారు. – భూసేకరణ చేయకుండా మాట్లాడుతున్నారు. మరి మేం ఎలా భూసేకరణ చేశాం..? అన్నిటినీ అధిగమించాం కదా? – మా ప్రభుత్వం రాగానే విత్డ్రా కాలేదు కదా..సుప్రీం కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చి మరీ చేశాం కదా? – ఇచ్చిన దాంట్లో 500 ఎకరాలు తగ్గించి, దాంట్లో పారిశ్రామిక నోడ్ పెట్టి చేశాం. అప్పుడే కదా వయబులిటీ వచ్చింది. – అప్పుడు ఇవన్నీ చేయలేకపోయారు..? అది నోరా..తాడిమట్టా..? చేతకాక మాట్లాడుతున్నాడు. మార్పులు సహజం..పార్టీ ఏ ఒక్కరినీ విస్మరించదు: – ఎవరికైనా మారిస్తే బాదుంటుంది. ఒకరోజు బాధ ఉంటుంది. మరుసటి రోజు నాగిరెడ్డి ఏం చెప్పారో చూడండి. – ఒక రాజకీయ పార్టీ అన్ని కోణాలు చూసుకుని, అన్నీ భేరీజు వేసుకునే చేస్తాయి. – తెలుగుదేశం పార్టీ మాత్రం ఓడిపోవడానికి చేస్తారా? వారు గెలవాలనే ప్రయత్నం చేస్తారు. – అందుకే పవన్ కల్యాణ్ను కలుపుకుంటారు..ఆయనతో పాటు మూడో వారు కూడా మాతో ఉండాలని కోరుకుంటారు. – పార్టీ ప్రతి అంశాన్ని కూలకుషంగా చర్చించి, అందరినీ గౌరవిస్తూ ముందుకు వెళ్తుంది. – ఏ ఒక్కరినీ విస్మరించదు..అందర్నీ ఉపయోగించుకుంటుంది. – నేనూ కాంగ్రెస్ నుంచే వచ్చిన వాడినే. ఒక్క శాతమైన ఇక్కడ వారికి ఛాన్స్ ఉందా? – తెలంగాణలో అధికార పార్టీ పోతే..రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఏమైంది..? జగన్ గారు మహిళా పక్షపాతి..ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని చెప్పాం: – ముందుగా కొంత మంది మంత్రులు, అధికారులతో కలిసి సమావేశం పెట్టాం. – అంగన్ వాడీ సంఘాల వారు వచ్చారు. నాలుగున్నర గంటలు వారితో చర్చించాం. – పలు దఫాలు చర్చలు జరిపినప్పుడు కూడా సమ్మె విరమించమని కోరాము. దయచేసి విధుల్లోకి రండి అని చెప్పాం. – ఈ ప్రభుత్వం ఏ విషయంలోనూ మీకు వ్యతిరేకం కాదు..అందులోనూ జగన్ గారు మహిళా పక్షపాతి. మీ పట్ల ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సానుభూతితో ఉన్నారు. – వారు 11 అంశాలతో నోటీసులిచ్చారు. – అగన్వాడీలకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలి. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి అని అడిగారు. – చర్చల్లోకి వచ్చిన సందర్భంలో తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వండి అని అడిగారు. – సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేయాలి. – ఆ తీర్పు గుజరాత్కు సంబంధించినదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమం అమలు చేయడం లేదు. – గ్రాట్యుటీ అంశంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాము. వారు స్పందించలేదు. మళ్లీ మీరు కోరిన విధంగా లేఖ రాస్తాం. – కేంద్ర నిర్ణయం వచ్చే వరకూ ఇప్పటి వరకూ ప్రభుత్వం ఇస్తున్న రూ.50వేలను రూ.1 లక్షకు పెంచుతామని చెప్పాం. – అంగన్వాడీ వర్కర్కి అయితే వాళ్లికిస్తున్న రూ.20వేలను రూ.40 వేలు చేస్తామని చెప్పాం. – మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లను మార్చాలన్నారు. దీనికి వంద శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని చెప్పాం. – కేంద్ర ప్రభుత్వ విధివిధానాలున్నాయి..దాని ప్రకారం చేయిస్తామని కూడా చెప్పాం. – 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభా ప్రాతిపదికన కేంద్ర నిబంధనల మేరకు స్థాయి పెంచేందుకు అవకాశం గుర్తించాం. వాటిని మార్పు చేస్తాం. – హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు అమలు చేయాలి..50 ఏళ్ల వరకూ ప్రమోషన్ ఉండాలని కోరారు. ప్రభుత్వం అభ్యంతరం లేదని చెప్పింది. – వర్కర్స్ మినిమమ్ పదో తరగతి చదవాలనే నామ్స్ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. – సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబానికి ఆర్ధిక సాయంతో పాటు బీమా అమలు చేయాలని కోరారు. – బీమా వంద శాతం చేస్తాం. చనిపోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. – రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి..మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం 62 ఏళ్లకు ఒప్పుకుంది. మెడికల్ లీవ్ పరిశీలిస్తామని చెప్పాం. – వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో గ్యాస్ను ప్రభుత్వమే పంపిణీ చేయాలని కోరారు. శాస్త్రీయంగా పరిశీలిస్తామని చెప్పాం. – పెండింగ్లో ఉన్న ఇంటిఅద్దెలు, 2017 నుంచి టీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. – 2017 నుంచి టీఏలు ఇవ్వడం లేదు. ఆ స్కీమే ఎత్తేశారు. మీరు కొత్తగా టీఏ కావాలంటే చర్చిద్దామన్నాం. – ఇప్పటి నుంచి ఇవ్వడానికి అభ్యంతరం లేదని కూడా చెప్పాం. – యాప్లు, ఫేసియల్ రికగ్నైజేషన్ వంటి డిమాండ్లు ఉన్నాయి. – రాష్ట్రంలో టీచర్ల నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ దాన్ని అమలు చేస్తున్నాం. దాన్ని మార్చడం కష్టమని చెప్పాం. – మూడు, నాలుగు యాప్లు అంటున్నారు. వాటిని మినిమైజ్ చేసి భారం లేకుండా చేస్తామని చెప్పాం. మేనిఫెస్టోలో చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం: – ఒక్క జీతం తప్ప మిగతా అన్నింటికీ సానుకూలంగా స్పందించాం. – వారు రూ.28 వేలు ఇవ్వాలన్నారు..తెలంగాణ కంటే అదనంగా ఉండాలి. – ఎంతో కొంత మాత్రం ఎక్కువ ఇవ్వాలి..మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు. – మేనిఫెస్టోలు మేం అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మెరుగుపరుస్తాం అని చెప్పాం. – మేం అధికార బాధ్యతలు తీసుకున్నప్పుడు తెలంగాణలో రూ.10,500 ఉంది. దాన్ని మేం వెయ్యి రూపాయలు పెంచి రూ.11,500 చేశాం. – కానీ తెలంగాణ ఎప్పుడు పెంచితే అప్పుడు మేమూ పెంచుతాం అని మేం చెప్పలేదు. – తర్వాత తెలంగాణ 2021 జులై నుంచి 13,650 ఇస్తున్నారు. ఆ రెండేళ్లు మేం తెలంగాణ కంటే ఎక్కువే ఇచ్చాం కదా? – ఇప్పుడు మళ్లీ వాళ్లు పెంచారు కాబట్టి వారికంటే ఎక్కువ ఇవ్వమంటున్నారు. – ఇది సమంజసం కాదు..సరైన సమయం కూడా కాదని చెప్పాం. – ఇది ఎన్నికల సమయం. ఎన్నికలు అయిన తర్వాత మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటారని జగన్ గారు చెప్పారు. – ఆ ఒక్క దానికి మూడు నెలలు సమయం కోరాం. ముఖ్యమంత్రి గారు మిగిలనవన్నీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. – ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా మీ జీతాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. – మీరు తెలంగాణ అంశాన్ని ఎత్తారు కాబట్టి మేం దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఆలోచన కాదు. – మేం మేనిఫెస్టోలో పెట్టాం...పెట్టిన ప్రకారం అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు పెంచాం. కానీ తెలంగాణలో ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని మేం చెప్పలేదు. – ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకన్నా తక్కువ ఇస్తున్న సందర్భాలున్నాయి..ఎక్కువ ఇస్తున్నవీ ఉన్నాయి. – పక్క రాష్ట్రమైన ఒరిస్సాతో పాటు 15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి. – దానితో మాకు అవసరం లేదు కానీ..మీ సమంజసమైన కోరికను తప్పకుండా చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పాం. – ముందు మీరు విధుల్లోకి వెళ్లండి. బాలింతలు, పిల్లలు, గర్భిణీలకు ఇబ్బంది పెట్టడం ధర్మం కాదని చెప్పాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు..: – మా ముందు సానుకూలంగా స్పందించి..బయటకు వెళ్లి కాదంటూ ఎనౌన్స్ చేస్తున్నారు. – ఈ ఐదు రోజుల్లో సీఐటీయూ పేరుతో సీపీఎం, ఏఐటీయూసి పేరుతో సీపీఐ గుర్తులు పెట్టుకుని వస్తున్నారు. – దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లారు. ఇది సమంజసం కాదని చెప్పాం. – రాజకీయ పార్టీలకు మా మా ఎజెండాలు మాకుంటాయి. వారికి పరిష్కారం కంటే వారి ఎజెండా ముఖ్యం. – ఎన్నికల సమయంలో వారి ఎజెండాలు ఇంకా వివిధమైన లైన్స్లో ఉంటాయి. – దయచేసి వారి ఉచ్చులో పడొద్దని కార్యకర్తలను, హెల్పర్లను విజ్ఞప్తి చేస్తున్నాం. – తలుపుల తాళాలు పగులగొట్టారని అంటున్నారు. అవి ప్రభుత్వానివి. – సెంటర్కి అద్దె ప్రభుత్వం ఇస్తుంది. దానిలో ఉన్న ప్రాపర్టీ అంతా ప్రభుత్వానిది. – ఒక వేళ మీరు సమ్మెకు వెళితే అవి అప్పజెప్పి వెళ్లాలి. అది నియమం..నిబంధన. – ఎన్జీవోలు ఎప్పుడైనా సమ్మెకు వెళితే ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్తారా? – దయచేసి సోదరీమణులందరినీ ప్రభుత్వం తరఫున అర్ధిస్తున్నాను. – ప్రభుత్వం మీ సమస్య పట్ల సానుకూలంగా ఉంది. కానీ కొంత సమయం కావాలి. – దయచేసి అర్ధం చేసుకుని మీరందరూ వెంటనే మీమీ విధుల్లోకి రండి. – ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఇప్పటికే కొన్ని ఉత్తర్వులిచ్చాం..ఇంకా ఇవ్వాల్సినవి ఇస్తాం. – అర్ధం చేసుకుని సానుకూలంగా స్పందించాలని, దయచేసి రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు. – వారి ఎజెండాలో మీరు తలదూర్చవద్దు..వారి ఎజెండాలోకి మీరు వెళ్లొద్దని కోరుతున్నా. – బాలింతలు, గర్భిణీలు, పిల్లలు వారికి ఇబ్బంది కలిగే పరిస్థితిని తీసుకురావద్దని, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరుతున్నా. – సానుకూలంగా స్పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. – వినకపోతే బాలింతలు, గర్భిణీలు, పిల్లలను ఇబ్బంది పెట్టి కడుపు కొట్టలేం కదా? – వారికి ఇవ్వాల్సిన పోషకాహారం ఇవ్వాలి కదా? మనకు కోపం వచ్చిందని వాళ్లని ఇబ్బంది పెట్టుకూడదు. – పరిస్థితి అంత వరకూ వెళ్లకూడదని మా కోరిక. అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. – చర్చలంటూ బెదిరింపులు అంటే ఎలా..? బాలింతలు, పిల్లలు, గర్భిణీలకు బాలామృతం ఇవ్వడం బెదిరింపా? – ఎక్కడా కూడా ఎవ్వరినీ బెదిరింపు అనే దోరణి, ఆలోచనే మాకు లేదు. – వాళ్ల ఇబ్బందిలో ప్రభుత్వం స్పందించకపోతే మా తప్పు అవుతుంది.