తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షణకు ఎప్పుడైనా కృషి చేశారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎప్పుడు ఏదో ఒక అన్యాయం జరిగిపోతున్నట్లు మొసలికన్నీరు కార్చుతుంటారని విమర్శించారు. ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు దళితులు గుర్తు రారు. దేవాలయాలు గుర్తుండవు..రాష్ట్రానికి సీబీఐ రాకూడదని హుకుం జారీ చేస్తారని, అధికారం పోయిన తరువాత ఇవన్నీ గుర్తుకు వస్తాయని మండిపడ్డారు. దేవుళ్లను, ఆలయాలను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని, అదిప్రమాదమో? కుట్రో తెలిసిపోతుందన్నారు. సీఎం వైయస్ జగన్ పనితీరును ప్రజలంతా హర్షిస్తున్నారని ..ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు ఏదో ఒక ఆరోపణ చేస్తుంటారని దుయ్యబట్టారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నవశకం నాయకుడు సీఎం వైయస్ జగన్.. ఓ అన్నగా..తమ్ముడిగా..ఓ కొడుకుగా సీఎం వైయస్ జగన్ నిన్న వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక నాయకుడిగా రాజకీయాల్లో విలువలు తీసుకువచ్చిన నవ శకం నాయకుడు ఆయన. నవరత్నాల్లో అన్ని హామీలు నెరవేర్చారు. చెప్పవని కూడా ఎన్నో అమలు చేశారు. దురదృష్టం..ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం. పది మందికి పనికి వచ్చే కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఎక్కడో కనిపిస్తున్న సంఘటనలు భూతద్దంలో చూపించి ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేస్తుంటారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారు.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సీరియస్గా ఉంది. నిందితులను పట్టుకునేందుకు ప్ర భుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నాం. దర్యాప్తుతో కొన్ని అనుమానాలు రావడంతో అపోహాలు ఉండకూడదని, వాటని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి..సీబీఐ విచారణకు సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి సీబీఐ రాకూడదని జీవో ఇచ్చారు. ఆ రోజు ఆరకమైన చర్యలు ఉన్నాయి. ఈ రోజు ఏదైన అనుమానం, అపవాదులు వస్తే ఏకంగా సీబీఐతో విచారణకు మేం సిద్ధమయ్యాం. కుంటి సాకులు చెప్పుకొని తప్పించుకోవడం సీఎం వైయస్ జగన్ నైజం కాదు. బాధ్యత గల నాయకుడిగా సీబీఐ విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.. నిన్న జరిగిన కార్యక్రమంతో మహిళలు ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఈ ఐదేళ్లు కొనసాగుతాయి. ప్రభుత్వం మహిళలను వాళ్ల కాళ్లపై నిలబడే విధంగా ఆర్థిక చేయూతనందిస్తుంది. ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. అన్నివర్గాల ప్రజలు కూడా ఇవాళ హాయిగా..చల్లగా ఉన్నారు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆందోళన అంతా కూడా ఇవాళ అధికారం కోల్పోయిన చంద్రబాబుకే. అందుకే రోజుకో ఆరోపణ చేస్తారు. టీడీపీ హయాంలో ఒక్క విచారణ అయినా చేయించారా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలు అంటూ దేవాలయాలు ధ్వంసం చేశారు. గోదావరి పుష్కరాల్లో ఏకంగా ఆయన పబ్లిసిటీ పిచ్చితో 29 మంది మృత్యువాత పడ్డారు. వీటిపై ఎలాంటి విచారణలు జరగలేదు. విచారణ ఎందుకని వితండ వాదం పెట్టుకుని తప్పించుకున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఉపేక్షించేది లేదని నిన్ననే సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ప్రార్థనమందిరాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదని సీఎం సూచించారు. గుడైనా..మసీదైనా..చర్చి అయినా కూడాఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలు లేదని అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగిన వెంటనే సీఎం వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబుకు గుర్తు రావు.. చంద్రబాబు చరిత్రలో హిందు దేవాలయాల కోసం పని చేసిన దాఖలాలు లేవు. హిందూ ధర్మ పరిరక్షణకు ఎప్పుడైనా ఆయన కృషి చేశారా?..ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలు కూల్చడం, అధికారం కోల్పోయిన తరువాత చిన్న సంఘటనలు జరిగితే చాలు మొసలి కన్నీరు కార్చడం ఆయన నైజం. విశాఖ ఘటనలో సీఎం వైయస్ జగన్ ఎలా స్పందించారో చూశాం. చంద్రబాబు ఇలా స్పందించిన దాఖలాలు ఉన్నాయా?. దళితులను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. మా ప్రభుత్వం దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తోందో మనం చూస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడైనా కొత్త చట్టాలు తెచ్చారా? దళితులకు ఉపయోగపడే పనులు చేశారా?..అధికారం కోల్పోయిన తరువాత మాత్రం ముసలి కన్నీరు కార్చుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పేదలు గుర్తుకు రారు.ఆయనకు బడా బాబులు మాత్రమే గుర్తుంటారు. వాళ్ల కోసమే పని చేస్తారు. శాంతిభద్రతలు అక్కర్లేదా? ఇంకో జాతీయ పార్టీ వాళ్లు వచ్చి ఆందోళన చేస్తున్న వారిని విడుదల చేయాలని ధర్నాలు చేస్తున్నారు. వీరికి శాంతిభద్రతలు అక్కర్లేదా? ఏ కార్యక్రమం చేయాలో ప్రభుత్వానికి తెలుసు. అధికారంలో ఎవరూన్నా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ పార్టీలంటే అవాక్కులు, చవాక్కులు పేల్చడం కాదు. పార్టీ సిద్ధాంతం, విలువలు ఉండాలి. చంద్రబాబుకు ఇలాంటివి ఉండవు. ఎవరైనా నాయకుడి ఇంటికి వెళ్తే ..చంద్రబాబు ఆయన గడ్డం పట్టుకుంటారు..అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు. బయటకు వస్తే మళ్లీ విమర్శిస్తారు. రాజకీయ పార్టీగా, రాజకీయ కోణంలో ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ..ఇష్టం వచ్చినట్లు బురదజల్లడం సరికాదు. నిన్న జరిగిన సంఘటనపై అవసరమైతే థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తాం. నిన్నటి వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలు ఆనందంగా ఉంటే కొందరు వచ్చి అల్లరి చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను సహించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.