విశాఖ: నేర ప్రవృత్తి కలిగిన టీడీపీ నేతలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, కుట్ర, హత్య రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వెలగపూడి రామకృష్ణ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వెలగపూడి రామకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి ఛాలెంజ్ విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖ ప్రజలను మోసం చేసి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడని, వంగవీటి రంగ హత్య కేసులో వెలగపూడి రామకృష్ణ నిందితుడిగా ఉన్నాడన్నారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వెలగపూడి రామకృష్ణకు లేదన్నారు. భూఆక్రమణదారుల నుంచి వందల ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. భూఆక్రమణలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.