విద్యతోనే సామాజాభివృద్ధి సాధ్యం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం

రెగ్యులేటరీ కమిషన్‌ బిల్లుతో విద్యా వ్యవస్థ ప్రక్షాళన

మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి:  సమాజాభివృద్ధి విద్యాభివృద్ధితోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నమ్మారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బిల్లును తెస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్‌కు పూర్తిగా దాసోహం అయ్యాయని విమర్శించారు. విద్యా సంస్థల యాజమాన్యాలే పాలకులుగా ఉండటంతో గత పాలకులు విద్యా వ్యవస్థపై సీతకన్ను వేశారని విమర్శించారు. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతల దృష్టి అంతా కూడా ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ప్రాజెక్టులపైనే ఉండేదన్నారు. కార్యకర్తలకు నీరు–చెట్టు పేరుతో డబ్బులు దోచిపెట్టే కార్యక్రమాలు చేపట్టారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా బడ్జెట్‌లో 15.7 శాతం..అంటే రూ.33 వేల కోట్లకు పైగా విద్యాశాఖకు కేటాయించారని వివరించారు. వైయస్‌ జగన్‌ ఒక విజన్‌తో విద్యా వ్యవస్థను ముందుకు నడుపుతున్నారని చెప్పారు. పాఠశాలల్లోనే పుస్తకాలు విక్రయించారని, బిల్డింగ్‌ ఫండ్‌ పేరుతో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఇక ఉండవన్నారు. విద్యావ్యవస్థలో పెనుమార్పులకు తెర లేపుతున్నామని, రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చట్టాలు చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బాబసాహేబ్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌ భావజాలాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పునికిపుచ్చుకున్నారని చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్‌ చట్టం ఎన్నికల మేనిఫెస్టోలో ఒక భాగమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయని కార్యక్రమాలు ఐదు వారాల్లోనే మేం చేసి చూపించామని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్‌ను నిండు మనసుతో ఆమోదించాలని సభ్యులను మంత్రి కోరారు. ఈ కమిషన్‌  ఫీజుల నియంత్రణ, అడ్మిషన్ల ప్రక్రియ, మెథడాలజీ, ఇన్‌ఫ్రక్ట్చర్‌ వీటన్నింటిని రెగ్యులేట్‌ చేస్తుందన్నారు. టీచర్ల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన వేతనాలు, క్వాలిఫికేషన్‌ అన్ని కూడా ఈ కమిషన్‌ చూస్తుందన్నారు. ఫీజులను అధిక శాతం టీచర్ల వేతనాలకు, పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 

ప్రైవేట్‌ స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులు: ఎమ్మెల్యే చెవిరెడ్డి
గతంలో ప్రైవేట్‌ స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 4 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసేశారని విమర్శించారు. టీడీపీ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు నిబంధనలు పాటించడం లేదన్నారు. యాజమాన్యాలు జలగలు రక్తం పీల్చినట్లు డబ్బులు పిండుకున్నాయని ధ్వజమెత్తాయి. 
 

Back to Top