వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎండీయూ ఆప‌రేట‌ర్లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఏపీ ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) యూనియన్‌ కృష్ణా జిల్లా ప్రతినిధులు క‌లిశారు.
ప్రజల వద్దకు ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ వైయస్‌ జగన్‌కు ఆపరేటర్లు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్య‌క్తం చేశారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్‌ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని ఆప‌రేట‌ర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు.  ఎండీయూ ఆపరేటర్లకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

ఈ సందర్భంగా ఎండియూ యూనియన్ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు శ్యామ్‌బాబు మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను నిలువునా ముంచింది, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ ఆపరేటర్లు ఉన్న సమయంలో రైస్‌ పక్కదోవ పట్టాయన్నారు కానీ ఈ నెలలో రేషన్‌ షాప్‌ ల ద్వారా రైస్‌ పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేక చోట్ల రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. మాకు వెహికిల్‌ లోన్స్‌ క్లియర్‌ చేస్తామని అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. ప్రజాపంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. ప్రజలు రేషన్‌ షాప్‌ల వద్ద క్యూలైన్స్‌లో నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్ళీ మళ్ళీ తిప్పించుకుంటున్నారు. మేం వైయ‌స్ జగన్‌ గారిని కలిసి మా సమస్యలు వివరించాం, తప్పకుండా మిమల్ని ఆదుకుంటామని వైయ‌స్ జగన్‌ గారు భరోసానిచ్చారు. మాకు సంతోషంగా ఉంది` అని శ్యామ్‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Back to Top