కడప: రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా వర్షపాత లోటు తక్కువగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 52.28 శాతం లోటు ఉందని తెలిపారు. కరువు ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కోరారు. తుఫాను నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు. ఖరీఫ్ దెబ్బతిన్న నేపథ్యంలో రబీ సీజన్కు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి, అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని అన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తరలిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రవీంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, పెట్టుబడి వ్యయాలతో నష్టపోయిన కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని కోరారు. కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే వైయస్ఆర్సీపీ రైతుల పక్షాన నిలబడి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతుందని పి. రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు.