విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పెగ్, లెగ్ కథలు అందరికీ తెలుసని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని, కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసన్నారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు. రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు. చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు.