రైతుల‌ను ఇబ్బంది పెడితే రోడ్లెక్కుతాం

కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి 
 

వైయ‌స్ఆర్‌ జిల్లా: విద్యుత్‌ సరఫరా వేళ‌లు 9 గంట‌ల నుంచి 7 గంటలకు కుదించి రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తే రోడ్లెక్కుతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి హెచ్చ‌రించారు. .రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామ‌న్నారు. ఇవాళ వైయ‌స్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా రైతులు ఎదుర్కంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఎంపీ అవినాష్‌రెడ్డి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైయ‌స్‌ జగన్‌ 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం ..రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్‌ సిక్స్‌ అమలు అంతకన్నా లేదు. కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు లేక ప్రజల చేతుల్లో డబ్బు లేక వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఉమ్మడి వైయ‌స్ఆర్‌  జిల్లా పరిషత్‌ సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు కాదు..చివరికి కలెక్టర్,జేసీలు కూడా హాజరు కాలేదు. మేం అభ్యంతరం తెలిపితే అరగంట తర్వాత జేసీ వచ్చారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. ఒక జిల్లా అత్యున్నతస్థాయి సమావేశానికి మంత్రులు సరే..కనీసం కలెక్టర్‌ కూడా రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’అని అవినాష్‌రెడ్డి అన్నారు.

Back to Top