తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే నీచ ప్రయత్నం మొదలుపెట్టారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జూపూడి ప్రభాకర్ ఏమన్నారంటే.. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా గ్రూప్ గొంతు నొక్కాలన్న కుట్ర రాష్ట్రంలో జరుగుతోంది. అందులో భాగంగానే రెండు రోజులుగా సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా పత్రికా కార్యాలయాన్నే తగలబెట్టడం అత్యంత హేయం. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసిన పచ్చమూకలు, ఆఫీసులో ఫర్నీచర్కు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని సోఫా సెట్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడే ఉన్న భవనం యజమాని కారు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ప్రభుత్వ పెద్దలు ఒక వ్యూహం ప్రకారం లేని వివాదాన్ని సృష్టించడంతో పాటు, అక్రమ కేసులు బనాయించి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించారు. మరోవైపు దాడులు చేస్తూ, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయాన్ని మరవొద్దని, మరోసారి హెచ్చరిస్తున్నాం. అందుకే ఇకనైనా వైఖరి మార్చుకోవాలని చెబుతున్నాం. లేకపోతే.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కు, పత్రికా స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు లను హరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు అంబేడ్కర్ వాదులుగా, మహానేత వైయస్సార్ అభిమానులుగా, వైయస్ఆర్సీపీ కార్యకర్తలుగా మా ప్రతిఘటన నిరంతరం కొనసాగుతుంది.