తాడేపల్లి: రాష్ట్ర శాసనమండలిలో ఇవాళ చోటుచేసుకున్న ఘటనలు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయాయని వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పవిత్ర వేదిక అయిన చట్టసభలోనే అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు గారి పట్ల మంత్రులు, టీడీపీ సభ్యులు అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి కులం, మతం పేరుతో టార్గెట్ చేయడం చట్టసభల సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని స్పష్టమైందని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, దీనివెనుక స్పష్టమైన దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సభలో ఉండగానే ఈ ఘటన జరగడం మరింత ఆందోళనకరమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక దళిత వ్యక్తిని మతం, కులం పేరుతో అవమానించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వంపై దాడి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఛైర్మన్ను “ఏ మతానికి చెందినవారు?” అని ప్రశ్నించడం చట్టసభల గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి, ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుమల నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తగానే అధికార పక్షం అసహనానికి లోనైందని పేర్కొన్నారు. మార్కెట్ రేటు కంటే అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేస్తూ హెరిటేజ్ యూనిట్ ద్వారా లాభాలు పొందుతున్నారనే అంశాలపై సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. మండలిని తమ చేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశంతోనే ఛైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరంగా వ్యవహరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై తక్షణ చర్యలు తీసుకుని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. చట్టసభల గౌరవాన్ని కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యత అని స్పష్టం చేశారు.