మహిళలపై దాడిచేస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదు

విశాఖలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టుచేశాం

జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్‌ హత్యపై విచారణ జరుగుతోంది

విశాఖ దిశ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన హోంమంత్రి తానేటి వనిత

విశాఖ: మహిళలపై దాడులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. విశాఖ దిశ పోలీస్‌ స్టేషన్‌ను మంత్రి తానేటి వనిత సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల కోసం దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకువచ్చామన్నారు. అనంతరం విశాఖలో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు. మహిళలపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం..
ఏలూరు జి.కొత్తపల్లిలో హత్యకు గురైన గంజి ప్రసాద్‌ వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడేనని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. బాధిత కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై కొందరు దాడికి దిగారని, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, విచారణ జరుగుతుందని చెప్పారు. జి.కొత్తపల్లిలో  శాంతిభద్రతల సమస్య లేకుండా చూస్తామని, గంజి ప్రసాద్‌ హత్య, ఎమ్మెల్యేపై దాడికి గల కారణాలు తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని హోంమంత్రి వనిత చెప్పారు. 

 

Back to Top