తాడేపల్లి :రాష్ట్రంలో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందాల్సిన పౌష్టికాహార పథకాల్లో కూటమి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా దోపిడీకి పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీల ద్వారా పంపిణీ చేసే కోడిగుడ్లు, బాలామృతం పథకాల్లో టెండర్లను అడ్డగోలుగా సిండికేట్గా మార్చి తమకు అనుకూలమైనవారికే కట్టబెట్టారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గర్భిణులు, చిన్నారులకు కనీసం 50 నుంచి 70 గ్రాముల బరువున్న నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా, తూకంలో భారీగా కోత విధిస్తూ కేవలం 30 నుంచి 35 గ్రాముల నాసిరకం గుడ్లను ఇస్తూ పసిపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, రూ. 1200 కోట్ల విలువైన బాలామృతం టెండర్లలోనూ అర్హత నిబంధనలను మార్చి భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. చిన్నారుల పౌష్టికాహారంలోనూ అడ్డగోలు దోపిడీ. గ్రామీణ ప్రాంతాల్లోని పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపం, రక్తహీనత, విటమిన్ ఏ, బి12, డి, ఐరన్ లోపాలను నివారించేందుకు గుడ్డును ఒక సంపూర్ణ ఔషధంగా అందిస్తారు. ఇది రాజకీయాలకు అతీతంగా, మానవత్వంతో ఆలోచించాల్సిన అంశం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, మైనింగ్లతో పాటు చివరికి పసిపిల్లల నోటికాడి గుడ్డును కూడా మింగేసే స్థాయికి దిగజారింది. అత్యధిక ధరలకు కోట్ చేయించుకుని, సిండికేట్గా మారి పసిపిల్లల పోషకాలపై సైతం కక్కుర్తి పడుతున్నారు. గుడ్డు తూకంలో కోత – నాసిరకం సరఫరా. టెండర్ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు అందించే గుడ్డు కనీసం 50 నుంచి 70 గ్రాముల బరువు ఉండాలి. అప్పుడే వారికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అందుతాయి. కానీ ఈ నాయకులు కేవలం 30, 35, 40 గ్రాముల బరువున్న చిన్న గుడ్లను తెచ్చి ఇస్తున్నారు. అంటే 40 నుంచి 50 శాతం పరిమాణాన్ని తగ్గించేశారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోని పౌల్ట్రీల నుంచి అతి తక్కువ ధరకు దొరికే నాసిరకం చిన్న సైజు గుడ్లను ఏరికోరి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ‘నెక్’ (NECC) ధరలను తీసుకుంటూనే, ఒక్కో గుడ్డుపై రవాణా ఛార్జీల పేరిట రూ. 1.10 వరకు అదనంగా దండుకుంటున్నారు. ల్యాబ్ పరీక్షలు లేవు.. తనిఖీలు శూన్యం.. పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం సహా రాష్ట్రంలో ఎక్కడా చూసినా 35 గ్రాములకు మించిన గుడ్డు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం 50 గ్రాముల కన్నా తక్కువ ఉంటే రిజెక్ట్ చేసి టెండర్లు రద్దు చేయాలి. నెలకు 20 రోజులకోసారి ఐసీడీఎస్ అధికారులు శాంపిల్స్ సేకరించి అగ్మార్క్ ల్యాబ్లకు పంపి పరీక్షలు చేయించాలి. కానీ పేపర్ల మీద తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా పరిశీలన జరగడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుడ్లు నిల్వ ఉండి పాడవకుండా, ఒకేసారి డంప్ చేయకుండా కలర్ కోడింగ్ (ఎల్లో, గ్రీన్, బ్లూ మార్కింగ్స్) పెట్టి నిక్కచ్చిగా అమలు చేశాం. బాల సంజీవనిలో 40 కోట్ల దోపిడీ.. గర్భిణులకు ఇచ్చే బాల సంజీవని కిట్ల సరఫరాలోనూ భారీ గోల్మాల్ జరిగింది. రాష్ట్రాన్ని నాలుగు యూనిట్లుగా విభజించి రూ. 172 కోట్ల టెండర్లను ఒకే సిండికేట్కు అప్పగించారు. గతంలో సాధారణ ప్రాంతాల్లో రూ. 271, ఏజెన్సీలో రూ. 350 ఉన్న కిట్ ధరను ఏకంగా రూ. 446కు పెంచి దాదాపు రూ. 30 నుంచి 40 కోట్లు దోచేశారు. మారుతి ఆగ్రోస్, విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్, విక్టరీ బజార్, బాలాజీ గ్రౌండ్నట్ అనే నాలుగు సంస్థలకే గత మూడేళ్లుగా ఈ కాంట్రాక్టులు దక్కుతున్నాయి. చివరికి కేజీబీవీ స్కూళ్లకు అవసరమైన 38 రకాల నిత్యావసర సరుకుల కాంట్రాక్టులు కూడా వీళ్లకే కట్టబెట్టారు. బాలామృతంలో రూ. 1200 కోట్ల భారీ స్కామ్. ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు ఇచ్చే బాలామృతం న్యూట్రిషన్ పౌడర్ సరఫరాలో దాదాపు రూ. 1200 కోట్ల మెగా స్కామ్కు రంగం సిద్ధం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ‘తెలంగాణ ఫుడ్స్’ దీనిని అత్యుత్తమ నాణ్యతతో సరఫరా చేస్తోంది. పసిపిల్లలు తీసుకునే ఇలాంటి న్యూట్రిషన్ హెల్త్ మిక్స్ల తయారీ కోసం పెద్ద పెద్ద కంపెనీలే ఏళ్ల తరబడి పరిశోధనలు (R&D) చేస్తాయి. అలాంటి సున్నితమైన ఆహారాన్ని తయారుచేసే అనుభవం లేకపోయినా.. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చిక్కీలు, బెల్లం వ్యాపారం చేసే తమ అనుకూల కాంట్రాక్టర్లకు టెండర్ దక్కేలా అర్హత నిబంధనలను మార్చేశారు. ఫ్యాక్టరీ లేకపోయినా ఆరు నెలల్లో యూనిట్ పెడతామంటే చాలంటూ నిబంధనలు సడలించడం దుర్మార్గం. రాష్ట్రంలో 13.80 లక్షల మంది పసిపిల్లలతో కలుపుకుని.. 23.10 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు దాదాపు 5.77 కోట్ల గుడ్లు, ఏడాదికి 69.30 కోట్ల గుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఇంతమంది పేద తల్లులు, పసిబిడ్డల పోషకాహారంతో ప్రభుత్వం చెలగాటమాడటం తగదు. వైయస్సార్సీపీ డిమాండ్లు.. ఈ నేపధ్యంలో చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారిన బాలామృతం అక్రమ టెండర్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న సంస్థలకే న్యూట్రిషన్ పౌడర్ తయారీ బాధ్యతలు అప్పగించాలని, అంగన్వాడీల్లో కచ్చితంగా 50 గ్రాముల పైబడిన బరువున్న గుడ్లనే సరఫరా చేయాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లు సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న కాంట్రాక్టర్లను వెంటనే తొలగించి, వారిని బ్లాక్లిస్ట్లో పెట్టడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.