సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం

దేశంలో ‘ఎక్స్‌’ ట్రెండింగ్‌ తొలి స్థానంలో ‘వైయ‌స్‌ జగన్‌ ఎగైన్‌’ హ్యాష్‌ ట్యాగ్‌

హోరెత్తిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సామాజిక మాధ్యమాలు 

అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం వైయ‌స్ జ‌గన్‌ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైయ‌స్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామా­జిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమా­నులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం వైయ‌స్‌ జగన్‌ ర్యాంప్‌పై నడు­స్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజ­నాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్ లు నిండిపో­యాయి. 
సాధార­ణంగా ఎక్స్‌­లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ‘ఎక్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్వహించిన సభను ఎక్స్‌ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. 

లైవ్‌ సభల్లో టాప్‌.. 
‘ఎక్స్‌’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్‌ మేద­ర­మెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్‌టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామా­జిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం వైయ‌స్ జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మనవడి కోసం వచ్చాను
మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్‌ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అవుతోంది.  – అద్దంకి

వేదిక వద్ద ప్రైవేట్‌ డ్రోన్‌
‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్‌ డ్రోన్‌ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్‌ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ చేశారు.

Back to Top