దివంగ‌త మంత్రి గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు, అన‌కాప‌ల్లి ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటా

ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమ‌ర్‌నాథ్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

స‌చివాల‌యం: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజల చేసిన‌ అనంతరం త‌న కేటాయించిన బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. త‌న‌కు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు.

అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌పై గురుతరమైన బాధ్య‌త ఉంచార‌ని, మంత్రిగా రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తాన‌ని గుడివాడ అమ‌ర్ చెప్పారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ది, ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తాన‌ని వివ‌రించారు. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాన‌ని చెప్పారు. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం విశాఖ‌ప‌ట్నానికి ఉంద‌న్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృధ్దికి, పెట్టుబడులకి అనుకూలమైంద‌ని, 900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్నాయ‌న్నారు. దేశంలోనే గొప్ప పరిపాలనాధ‌క్షుడైన సీఎం వైయ‌స్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని,  దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు.. ఆయన ఆశయాలని కొనసాగిస్తాన‌ని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. 

Back to Top