తాడేపల్లి: కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ప్రశ్నించనివ్వకుండా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు, లాఠీచార్జీలు, వేధింపులతో అణచివేతకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండలో జరిగిన ఘటనతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైయస్సార్సీపీ బీసీ నేతలు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు కూటమి ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలపై వివక్ష, రాజకీయ వేధింపులు మానుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రెస్మీట్ గోరంట్ల మాధవ్ ఏమన్నారంటే.. - ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచలేరు ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత. కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రశ్నించే ప్రతి గొంతును కేసులతో, పోలీసు బలగాలతో అణచివేయాలని చూస్తోంది. పెన్నుపై మట్టి చల్లాలని ప్రయత్నించే వారు గుర్తుంచుకోవాలి... అదే పెన్ను 2029లో ప్రజల ఓట్ల రూపంలో సమాధానం చెబుతుంది. - ఉరవకొండలో చట్టబద్ధ నిరసనకే లాఠీచార్జ్ ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడికి సంబంధించిన భూ వివాదంపై ఆర్డీఓ, ఎమ్మార్వోలకు వినతిపత్రం ఇవ్వడానికి మేము పూర్తిగా శాంతియుతంగా వెళ్లాం. కానీ అక్కడ పోలీసులు భారీగా మోహరించి మమ్మల్ని నేరస్తుల్లా లాఠీచార్జ్ చేశారు. నాయకులపై కేసులు పెట్టారు. కార్యకర్తలను బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇవ్వడానికే అవకాశం ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అత్యంత విచారకరం. - వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు రాజకీయ కక్షసాధింపే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం, అమదాలవలస నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. అలాగే మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీసీలపై కక్షసాధింపు మానుకోవాలి భూ వివాదంలో కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు బాధితుల పక్షాన ఉన్నా వారికి న్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదు. అదే సమయంలో వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ధోరణి ఆందోళన కలిగిస్తోంది. బీసీలపై కక్షసాధింపు రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించాలి. రాజకీయ కక్షసాధింపును పక్కనపెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగిస్తూ, బీసీలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.