రాజమహేంద్రవరం: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడిరోడ్డుపై యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యానించారు. ఇది రెడ్ బుక్కా, బ్లడ్ బుక్కా అని జాతీయ మీడియాలో ఎపి గురించి అడుగుతున్నారని ఆయన అన్నారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా, పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ను స్థానిక వి ఎల్ పురం, మార్గాని ఎస్టేట్స్. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈసందర్బంగా భరత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెనాలిలో యువకులపై విచక్షణారహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవకముందే అదే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ ని కూడా వేధించడం వలన అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని భరత్ నిలదీశారు. ఇక కోర్టులెందుకన్నారు. నిజంగా తప్పుచేస్తే కోర్టులో నిరూపించి అవసరమైతే ఉరి శిక్ష వేయండి అంతేకాని, ఇలా రోడ్డుమీద చిత్రవధ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎండియు ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ రద్దు చేసి, సరుకులకు రేషన్ షాపుల దగ్గరకే రమ్మనడం శోచనీయమని భరత్ విమర్శించారు. రేషన్ షాపుల దగ్గరకు కూడా వెళ్లకుండా ప్రజలను సోమరుపోతులను చేసేశారని కొందరు కుహనా మేథావులు చర్చలు పెట్టిమరీ చెప్పడం వింతగా ఉందన్నారు. నేరుగా ఇంటికే రేషన్ అందించే విధంగా ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని, ఒకవేళ ఇంటింటికి కాకపోయినా వీధి చివర వాహనం ఆపి ఇస్తే తప్పేంటని ఆయన నిలదీసారు. రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన దుస్థితి కల్పించడం ఎంతవరకు సమంజసమని భరత్ ప్రశ్నించారు. రేషన్ షాపుల దగ్గరకు వచ్చి ప్రజలు ఏవిధంగా ఇక్కట్లకు గురవుతున్నారో ఒకసారి గమనించాలని క్లిప్పింగ్స్ ను భరత్ ప్రదర్శించారు. పెద్ద పెద్ద క్యూలైన్లు, గాలి ఆడక విసురుకోవడం, ఎండలో నిలబడ్డం వంటి ఘటనలు చూస్తున్నామన్నారు ముందు ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడతారోనన్నారు. ఇప్పటికే కరోనా కేసులు చూస్తున్నామని, ఇంకా పెరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ఒకసారి గమనించాలన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉన్న ఎండియు ఆపరేటర్ల వ్యవస్థ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. ఒకప్పక ప్రజల సౌకర్యం తీసేసి, మరోపక్క ఎండియు ఆపరేటర్లను రోడ్డున పడేశారని భరత్ విమర్శించారు. కోర్టులో గడువు కోరే స్థాయికి ప్రభుత్వ న్యాయవాదులు వచ్చారంటే ఈ అంశం ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు. ఇక రాష్ట్రంలోని 175నియోజక వర్గాల్లో జూన్ 1వ తేదీన రేషన్ షాపులు తెరుచుకుంటే, రాజమండ్రిలో మాత్రం తెరవలేదని భరత్ ఎద్దేవా చేసారు. కారణం ఏంటని ఆరా తీస్తే, ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజుకు వెళ్లారని వచ్చేవరకు రేషన్ షాపులు తెరుచుకోలేదని తెల్సిందన్నారు. మరీ ఇంత ఘోరమా అని ఆయన వాపోయారు. లక్షలమంది మహిళలున్న రాజమండ్రిలో ఒకటో తేదీన రేషన్ తీసుకోవాలని అనుకుంటారని ఎమ్మెల్యేకి తెలీదా, రాజమండ్రి మీ సొంత జాగీరు అనుకుంటున్నారా మీరు ఊళ్ళో లేకపోతె రేషన్ షాపులు తీయకూడదా ? మరీ ఇంత అన్యాయమా, ఇదేమన్నా రాచరికమా అని భరత్ నిలదీశారు. డిప్యూటీ సీఎం ఇలాఖాలో మంత్రి ఎక్కడ నుంచో వచ్చి రేషన్ షాపులు ప్రారంభిస్తే, ఇక్కడ ఎందుకు ప్రారంభించకుండా చేసారు అని భరత్ సూటిగా ప్రశ్నించారు. మద్యం షాపుల మాటున పర్మిట్ లేని రూములు పెట్టి తాగిస్తున్నారని భరత్ విమర్శించారు. రాజమండ్రి నగరంలో తాడితోట తదితర ప్రాంతాల్లో మద్యం షాపుల పక్కన భాగోతం అంటూ ఆయన క్లిప్పింగ్స్ చూపించారు. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఇలా 60వేల బెల్ట్ షాపులున్నాయన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యువతను మద్యం మత్తులో ఉంచుతున్నారని భరత్ అన్నారు. గుంటూరు లోని పొన్నూరు రోడ్డులో ఫైర్ స్టేషన్ దగ్గర మద్యం తగిన వారి తీరుని క్లిప్పింగ్స్ ప్రదర్శించారు. ఇలా చేస్తూ మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు. రాజమండ్రిలో పర్మిట్ లేని మద్యం రూములన్నీ మూసివేయించాలని ఎక్సయిజ్ అధికారులను భరత్ డిమాండ్ చేసారు. లేకుంటే మేమే వెళ్లి బంద్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్లపై తాగించి అల్లరిచేయిస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, ఇది పద్దతి కాదని అనిపించడం లేదా అని భరత్ ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వక ఇవ్వక ఇన్నాళ్లకు ఇచ్చారని, అయితే ఐదు లక్షల మంది ఆశావహులు పరీక్షలు రాయబోతున్నారని, కనీసం 90రోజులు సమయం ఇవ్వాలని అడిగితె, 40రోజుల్లో పరీక్ష పెట్టేస్తే ఎలాగని భరత్ ప్రశ్నించారు. సమయం ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమన్నారు. సమయం ఇవ్వకపోతే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆశావహులు ఏదో పనిచేసుకుంటూ ఉంటారని, సమయం ఇవ్వకుండా చేస్తే, వాళ్ళు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా అమలు చేయకపోవడంతో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని భరత్ పేర్కొన్నారు. ప్రజలను నమ్మించి, వంచించి అధికారం పీఠం ఎక్కారని ఆయన పేర్కొన్నారు. అందుకే జూన్ 4న వెన్నుపోటు దినం గా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ నాయకులూ, కార్యకర్తలు, ప్రజలు హాజరు ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు.