వ‌క్ఫ్ భూముల‌ను అప్ప‌నంగా అప్ప‌జెబుతున్నారు 

రూ. 800 కోట్ల విలువైన భూముల‌ను రూ. 40 కోట్ల‌కు ఇచ్చేసే కుట్ర 

ఏపీఐఐసీ ద్వారా సేక‌రించేందుకు ప్ర‌తిపాద‌న‌లు 

పారిశ్రామికవేత్త‌ల పేరుతో త‌న‌వారికి ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు పన్నాగం

మాజీ ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ అబ్దుల్‌ హ‌ఫీజ్ ఖాన్ ఆగ్ర‌హం 

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన హ‌ఫీజ్ ఖాన్

తాడేప‌ల్లి: అల్లాకు చెందిన వ‌క్ఫ్ భూమిని లీజుకు మాత్ర‌మే ఇవ్వాల‌ని.. అమ్మ‌కూడ‌దు, కొన‌కూడ‌ద‌ని తెలిసినా చంద్ర‌బాబు త‌న వారికి క‌ట్ట‌బెట్టేందుకు అనువుగా పావులు క‌దుపుతున్నారు. వ‌క్ఫ్ భూముల‌ను ప‌థ‌కం ప్ర‌కారం కాజేసే కుట్రల్లో భాగంగానే చంద్ర‌బాబు వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తిచ్చారనే అనుమానం క‌లుగుతోంది.  
గుంటూరులోని కొత్త‌మ‌ల్ల‌య్య‌పాలెంలో ఉన్న‌ జామియా మ‌సీదుకి చెందిన 233 ఎక‌రాలను వ‌క్ఫ్ బోర్డు నుంచి తీసేసి ఏపీఐఐసీ ద్వారా సేక‌రించి పారిశ్రామిక‌వేత్త‌ల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని కుట్ర చేస్తున్నారు. మార్కెట్ ధ‌ర కోట్ల‌లో ఉన్నా ఎక‌రా కేవ‌లం రూ. 9 ల‌క్ష‌ల‌కే ఏపీఐఐసీకి ఇచ్చేయాల‌ని వ‌క్ఫ్ బోర్డుకి ప్ర‌తిపాదన పంపారు. అంతేకాకుండా మొత్తం ధ‌ర ఒకేసారి చెల్లించ‌కుండా కేవ‌లం 25-30 శాతం చెల్లించేలా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు. ఒక‌వేళ వ‌క్ఫ్ భూమిని అప్ప‌గించాలంటే మార్కెట్ రేటుకు ఇవ్వ‌డ‌మో లేదా బ‌హిరంగ వేలం నిర్వ‌హించ‌డ‌మో చేయ‌కుండా అతి చౌక‌గా రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌కే అప్ప‌గించ‌డం వెనుక భారీ అవినీతి జ‌రుగుతోందని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌క్ఫ్ చ‌ట్టానికి మ‌ద్ద‌తిస్తూ ముస్లిం స‌మాజానికి న‌ష్టం కాకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చి మ‌రీ ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు. 233 ఎక‌రాల క‌నీస ధ‌ర క‌నీసం రూ. 500 కోట్ల‌కుపైగానే ఉంటే, దాన్ని కేవ‌లం రూ. 20 కోట్ల‌కు త‌న‌వారికి అప్ప‌గించే ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. దీంతోపాటు మంగ‌ళ‌గిరిలో అంజుమ‌న్ ఇస్లామియాకి చెందిన ఎన్నారై కాలేజీకి వెనుక ఉన్న రూ. 390 కోట్ల విలువ చేసే వ‌క్ఫ్ బోర్డు స్థ‌లాన్ని కూడా కేవ‌లం రూ. 20 కోట్ల‌కే క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర జ‌రుగుతోంది. ఈ విధంగా మొత్తం రూ. 800 కోట్ల‌కు పైగా విలువైన స్థ‌లాన్ని రూ. 40 కోట్లు అప్ప‌గించేందుకు ఏపీఐఐసీ ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. క‌ర్నూలు సిటీ సంతోష్ న‌గ‌ర్‌లో స‌ర్వే నెంబ‌ర్ 151లో 15 ఎక‌రాల వ‌క్ఫ్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. ఇది ముస్లిం స‌మాజానికి వెన్నుపోటు పొడ‌వడం కాదా?  చంద్ర‌బాబుకి భూములు కావాలంటే సీఆర్డీఏలో వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంకు ఉంటే వాటిని ఎందుకు ఇవ్వ‌డం లేదు?    వంద‌ల రూ. కోట్లు విలువ చేసే భూముల‌ను ఇంత కారుచౌక‌గా క‌ట్ట‌బెడుతున్న చంద్ర‌బాబు ముస్లిం స‌మాజానికి స‌మాధానం చెప్పాలి. ఈ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవాలి. 

గ‌త మా ప్ర‌భుత్వంలో ఏనాడైనా ఇలా వ‌క్ఫ్ భూములను ఇవ్వ‌డం చేశామా?  వ‌క్ప్ భూములు అన్యాక్రాంతం కాకూడ‌దని జీవో నెంబ‌ర్ 60 ద్వారా చ‌ట్టం తీసుకొచ్చారు. వ‌క్ఫ్ బోర్డు ప్ర‌కారం చూసినా, లేదా జీవో నెంబ‌ర్ 60 ప్ర‌కారం చూసినా ప్ర‌భుత్వం చేస్తున్న‌ది చాలా త‌ప్పు. ఈ భూముల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంతోపాటు వ‌క్ఫ్ బోర్డు సీఈవోపైన కూడా ఉంటుంది. గుంటూరు, క‌ర్నూలు జిల్లాల క‌లెక్ట‌ర్లు త‌క్ష‌ణ‌మే స్పందించి ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.

Back to Top