తీవ్ర ఫ్రస్టేషన్‌లో వంగ‌ల‌పూడి అనిత.. అందుకే పిచ్చి విమర్శలు

వైయ‌స్ జగన్‌ని ఏక వచనంతో సంబోధించడం సరికాదు

మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో నెల‌న్న‌ర‌లోనే చెడ్డపేరు

ఢిల్లీలో జరిగే నిరసనలో అన్ని జాబితాలు దేశ ప్రజల ముందు ఉంచుతాం

కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై మాజీ మంత్రి తానేటి వ‌నిత ధ్వ‌జం

తాడేపల్లిగూడెం: హోం మంత్రి వంగలపూడి అనిత మాటలు వింటుంటే.. ఆమె చాలా ప్రస్టేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆమె పనితీరుపై హెచ్చిరించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వనిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ సీఎం వైయస్‌ జగన్‌ను హోం మంత్రి ఏకవచనంతో సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు, లోకేష్‌ల వద్ద ప్రశంసల కోసమే నోటికొచ్చినట్లు దిగజారి మాట్లాడ్డం సరికాదన్నారు. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి శ్రీమతి తానేటి వనిత విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..

ఎందుకా మౌనం?
రాష్ట్రంలో గడిచిన నెలన్నర రోజులగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న హత్యారాజకీయాలు, విగ్రహాలు ధ్వంసం, షాపులు లూటీ వంటి సంఘటనలు హోంమంత్రిగా ఆమెకు తెలియవా?  వీటిపై ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏ స్ధాయిలో అదుపులో ఉందన్నది ఆలోచన చేయాలని.. తన బాధ్యతల పట్ల బాధ్యతగా ఉండాలే తప్ప.. ఇంకా తాను ప్రతిపక్షనాయకురాలిగా ఉన్నప్పుడు వాడిన భాషనే వాడుతూ అదే ధోరణిలో మాట్లాడ్డం సరి కాదన్నారు. 

అది మర్చిపోవద్దు
వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి ఆఫ్టరాల్‌ పులివెందుల ఎమ్మెల్యే అంటూ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై వనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు కూడా కుప్పం ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

ఆ బాధ్యత లేదా?
ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని.. 8 ఏళ్ల చిన్నారిని రేప్‌ చేసి చంపిన ఘటన జరిగితే.. హోంమంత్రిగా ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒక్కమాట మాట్లాకపోవడం చాలా బాధాకరమన్నారు. మాట్లాడలేదు సరికదా.. వారివైపు ఎందుకు కన్నెత్తి కూడా చూడలేదు, పరామర్శించలేదని ప్రశ్నించారు. సాక్షాత్తూ హోం మంత్రి అనిత పక్క నియోజకవర్గంలో 9వ తరగతి  బాలికను అత్యాచారం చేస్తే.. ఆ కుటుంబానికి అండగా ఉండలేదు సరి కదా.. కనీసం పరామర్శించలేదెందుకు అని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఏం చేశారన్నారు?.

ఏమిటా జవాబు?
హోంమంత్రి అనితకు సన్మానాలు చేసుకోవడానికి ఉన్న తీరిక.. ఆడిపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరిగితే ఆ కుటుంబాలని పరామర్శించడానికి మాత్రం తీరిక లేదన్నారు. వినుకొండలో నడిరోడ్డు మీద వైయస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను భయంకరంగా హత్య చేస్తే... నేను లాఠీలు, గన్నులు పట్టుకుని తిరగాలా అని హోంమంత్రి బదులివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఆ అవసరం లేదు
లాఠీలు, గన్నులు పట్టుకుని తిరగాల్సిన పని లేదని... అవి పట్టుకుని తిరుగుతున్న పోలీసులకు స్వేచ్ఛనిచ్చి.. వారి పని వారు చేసుకునే అవకాశం ఇవ్వాలని వనిత సూచించారు. పోలీసులను కేవలం వైయస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను నిర్భందించడానికే వాడుతూ.. స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ తప్పుతుందన్నారు. 

ఇదేం పని!
మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు... వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై దాడికి పాల్పడుతూ.. వాహనాలను తగలబెడితే.. వారిపై చర్యలు తీసుకోలేదు సరికదా.. తిరిగి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు. 

సుప్రీంకోర్టు తీర్పు గుర్తు లేదా?
మరోవైపు హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌ గురించి హోం మంత్రి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఇచ్చిన తీర్పుపై.. ఆ తరవాత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. 

అన్నింటా వైఫల్యం. అందుకే..
కేవలం నెలన్నర కాలంలో మీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రజల్లో.. వచ్చిన చెడ్డపేరుతో.. మీరు అన్నట్లుగానే మీకు మైండ్‌ దొబ్బినట్టుంది. మీ ప్రభుత్వంపై వచ్చిన చెడ్డపేరును, మీపై నెట్టేయడానికి మీ గెజిట్‌ పత్రిక ఈనాడు ద్వారా మీ చంద్రబాబు ప్రయత్నించడంతో మీకు పొద్దుటి నుంచీ బుర్ర పని చేయడంలేదని అర్థం అవుతోంది. ఆ అసహనం మీ ప్రెస్‌మీట్లో స్పష్టంగా కనిపించింది. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడారు’.. అని హోం మంత్రికి మాజీ మంత్రి మొట్టికాయలు వేశారు.

అదే మీ భయం
‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన నిరసన ద్వారా రాష్ట్రంలో గత 45 రోజులుగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్‌ దేశం దృష్టికి వెళ్తాయి. ఈ బ్లడ్‌గేమ్‌ ఆడిన చంద్రబాబు, చివరకు మిమ్మల్ని బ్లేమ్‌ చేసి, మీ పదవికి ఎసరు పెడతారనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఢిల్లీలో జరిగే నిరసనలో అన్ని జాబితాలు దేశ ప్రజల ముందు ఉంచుతాం. హోంమంత్రిగా ఉండి, కనీసం వివరాలు కూడా తెప్పించుకోలేని స్థితిలో మీరు ఉన్నారు’.. అని హోం మంత్రికి, మాజీ మంత్రి అనిత చురకలంటించారు. మొత్తం మీద, వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాల తెలుగుదేశం పార్టీ శిక్షణ, వైఖరిని బాగా అలవర్చుకున్నట్లు హోం మంత్రి అనిత మరోసారి నిరూపించుకున్నారని మాజీ మంత్రి వనిత అన్నారు.

Back to Top