తాడేపల్లి: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్ఓ) అనుమానాస్పద మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. నాడు పరకామణిలో డాలర్ల చోరీ కేసులో నిందితుడైన రవికుమార్ను పట్టుకున్న సతీష్ కుమార్, స్వయంగా పోలీసులకు అప్పగించాడని, ఇప్పుడు అదే కేసులో అదే సతీష్కుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితుడిగా చేర్చి, వేధిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే సతీష్ కుమార్ను సిట్ పిల్చి విచారించిందని, నాలుగు రోజుల తర్వాత అతడు తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్పై మృతదేహంగా పడి ఉండడం, అనేక అనుమానాలకు తావునిస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ వెల్లడించారు. ప్రెస్మీట్లో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ● ఆ మరణం అనుమానాస్పదం: సిట్ ఎదుట విచారణకు హాజరైన సతీష్కుమార్, తాను ఎలాంటి తప్పు చేయలేదని సిట్ అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ తప్పు చేయకపోయినా వేధించడం వల్లే సతీష్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తిరుపతి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసులో అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిని లాగేందుకు కుట్ర చేసి, ఆ విషయంలో సతీష్కుమార్పై తీవ్ర ఒత్తిడి చేసినట్లు తిరుపతిలో వినిపిస్తోంది. అందుకే సతీష్కుమార్ మరణం పూర్తిగా అనుమానాస్పదం. వీటన్నింటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ● రాజకీయ కేంద్రం చేశారు: కూటమి ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం టీటీడీని రాజకీయాలకు కేంద్రంగా చేసింది. అది లడ్డూ కావొచ్చు. దర్శనం కావొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. శ్రీవారిని రోజురోజుకు రాజకీయాల్లోకి లాగడం చూసి భక్తులంతా ఆవేదన చెందుతున్నారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు, నాడు పరిష్కారమైనా, దాన్ని తిరగదోడారు. ఆ కేసు పట్టుకుందే తానని, తాను ఏ తప్పూ చేయకపోయినా కేసలు ఇరికించి వేధిస్తున్నారని చెప్పి, సతీష్ కుమార్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ● రాష్ట్రంలో అరాచక పాలన: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అందులో భాగంగానే సతీష్కుమార్ ప్రాణాలతో లేకుండా పోయాడు. దీనికి కారణం ఏమిటో కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలి. అలాగే విచారణలో సిట్ అధికారులు సతీష్కుమార్ను ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. పరకామణి కేసులో సతీష్కుమార్ చాలా కీలకమైన వ్యక్తి. ఆ కేసులో నిందితుడైన రవికుమార్ను అతనే పట్టుకున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు అదే కేసులో అదే సతీష్కుమార్ నిందితుడు ఎలా అయ్యాడు? ఏమిటీ వేధింపులు?. ● అదే కూటమి ప్రభుత్వ కుట్ర: పరకామణిలో డాలర్ల చోరీ కేసులో నాటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిని ఇరికించే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రకరకాల కుట్రలకు తెర తీస్తోందని టీటీడీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ఏ తప్పూ చేయని టీటీడీ మాజీ అధికారిని విచారణ పేరుతో వేధించి ప్రాణాలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం ప్రేరేపించిందని, ఇది అత్యంత హేయమని అంతా భావిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వివరించారు.