తాడేపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ఆర్సీపీపై జరుగుతున్న విమర్శలకు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. “మాకు ఈసారి 11 సీట్లు వచ్చాయని, 40 శాతం ఓట్లు వచ్చాయని మేము ఎక్కడా కాదనడం లేదు. కానీ గతంలో 151 సీట్లతో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఇదే ప్రజలదే” అని పేర్కొన్నారు. గతంలో 151 సీట్లు వచ్చినా, నేడు 11 సీట్లు వచ్చినా ప్రతి ఓటు, ప్రతి సీటు వెనుక పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కార్యకర్తల శ్రమ ఉందని అన్నారు. మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడే గెలవగలిగే వారు వైయస్ జగన్ను 11 సీట్లు అంటూ విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఉన్నారా? కనీసం ముఖ్యమంత్రిగా అయినా అలాంటి విజయాన్ని సాధించిన నాయకుడు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు..ఇలా అనేక సందర్భాల్లో పొత్తులు లేకుండా పోటీ చేసి మెజారిటీ గెలుపు సాధించిన పార్టీ వైయస్ఆర్సీపీయేనని తెలిపారు. “100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఒకవైపు, సామాజిక బలం ఉన్న పార్టీ మరోవైపు ఉన్నా, కొత్త పార్టీగా నిలబడి రెండు పార్టీలను ఓడించి అధికారంలోకి వచ్చిన నాయకుడు వైయస్ జగన్ మాత్రమే” అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికారంలో లేదని వైయస్ జగన్పై ఎలాంటి వ్యాఖ్యలైనా చేయవచ్చని కొందరు భావిస్తున్నారని, అయితే ప్రజల తీర్పు మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. “ఈసారి లెక్క వేరుగా ఉంటుంది మిత్రులారా” అంటూ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.