తిరుపతి: జనసేన నేత కిరణ్ రాయల్ తమ పార్టీ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలు తగవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి వంటి నాయకులను విమర్శించే స్థాయి కిరణ్ రాయల్కు లేదని ఆమె పేర్కొన్నారు. తిరుపతిలో మీడియాతో గీతా యాదవ్ మాట్లాడుతూ, యాదవ కులస్తులను అవమానించేలా కిరణ్ రాయల్ మాట్లాడడం సరికాదన్నారు. యాదవ సమాజాన్ని విమర్శించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. తాను యాదవ్ కులానికి చెందిన మహిళనని, తన కుల ధ్రువీకరణ పత్రం చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అదే విధంగా కిరణ్ రాయల్ కూడా తన కుల ధ్రువీకరణ పత్రం చూపించాలని ఆమె సవాల్ విసిరారు. తిరుపతిలో కిరణ్ రాయల్ పలువురు మహిళలను మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయని గీతా యాదవ్ వ్యాఖ్యానించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మా నాయకుల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతామని, యాదవ సమాజాన్ని అవమానించేలా మాట్లాడితే సహించబోమని గీతా యాదవ్ స్పష్టం చేశారు.