పల్నాడుజిల్లా: పల్నాడు జిల్లా నాందెడ్ల మండలం మానుకొండ వారి పాలెం ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యంకు పాల్పడ్డారు. విడదల రజిని ప్రధాన అనుచరుడు, వైయస్ఆర్సీపీకి చెందిన శ్రీకాంత్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీనిపై పోలీసులను ప్రశ్నించిన విడదల రజినిపై సీఐ సుబ్బారాయుడు దౌర్జన్యంగా వ్యవహరించారు. ఏ కేసులో శ్రీకాంత్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని విడదల రజిని పోలీసులను నిలదీశారు. దీనికి సమాధానం చెప్పకుండానే విడదల రజిని కారు లో ఉన్న శ్రీకాంత్ని తీసుకు వెళ్ళటానికి విడదల రజినిని నెట్టివేసి, శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మహిళా మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించిన వైఖరి పట్ల వైయస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అత్యంత అభ్యంతరకం: మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా, మానుకొండవారిపాలెంలో విడదల రజని పీఏ శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మా పార్టీ నాయకురాలు విడదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. పీఏను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అరెస్టుకి గల కారణాలను అడగడం కూడా నేరమా? పోలీసులను ప్రశ్నిస్తే మహిళ అని కూడా చూడకుండా దాడి చేస్తారా? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. సీఐ సుబ్బారాయుడుని వైయస్సార్సీపీ నాయకుల మీద ఈ విధంగా కక్షసాధింపులకు పాల్పడేందుకే టీడీపీ ఎమ్మెల్యే నియమించుకున్నారు. మహిళల విషయంలో ఆయన ప్రవర్తన మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. నిన్నటికి నిన్న కంతేరులోనూ వైయస్సార్సీపీ ఎంపీటీసీ అయిన కల్పన అనే దళిత మహిళను వేకువజామున 3 గంటల సమయంలో 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వెళ్లి అరెస్ట్ చేశారు. నైటీలో ఉన్న ఆమె, చీర కట్టుకుని వస్తానని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఉదయం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు కోర్టులో చెప్పారు. నిర్బంధాలు, అణచివేతలతో వైయస్సార్సీపీని అడ్డుకోవాలని చూస్తే బెదిరేది లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.