తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాల్లో విచ్చలవిడి దోపిడీ సాగుతోందని, ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్న సొమ్మంతా బ్యాగుల రూపంలో కరకట్టపై ఉన్న చంద్రబాబు, లోకేష్ల గెస్ట్ హౌస్కే చేరుతోందని వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ హయాంలో ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరేలా పారదర్శక విధానం అమలు చేస్తే.. నేడు కూటమి నేతలు సిండికేట్లుగా మారి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతూ, లీగల్ కేసుల పేరుతో వైయస్ఆర్సీపీనేతలపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు వైయస్ఆర్సీపీ భయపడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - చంద్రబాబు హయాంలోనే రూ.25వేల కోట్ల లిక్కర్ స్కామ్: వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై తొలుత రూ.30వేల కోట్లు, ఆ తర్వాత రూ.3 వేల కోట్ల మద్యం స్కామ్ జరిగిందని అడ్డగోలుగా ఆరోపణలు చేశారని.. కానీ, అందులో ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేని స్థితిలో సిట్ ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పినట్లే సిట్ వ్యవహరిస్తోంది తప్ప, అందులో ఎలాంటి వాస్తవం లేదు. నిజానికి 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల భారీ మద్యం కుంభకోణం జరిగింది. ఆ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలను సిండికేట్కు అప్పగించారు. అధికారిక దుకాణాలకు తోడుగా 4,380 పర్మిట్ రూమ్లు, దాదాపు 40వేల బెల్టుషాపులను నడిపారు. ఎమ్మార్పీ కంటే 20 శాతం కంటే ఎక్కువ ధరకు విక్రయించి అక్రమంగా రూ.25వేల కోట్లు ఆర్జించారు. - ప్రివిలేజ్ ఫీజు రద్దు: కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అంగీకారం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టలరీలకు రూ.5,200 కోట్ల లాభం చేకూర్చారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు అంతే మొత్తంలో నష్టం వాటిల్లింది. గతంలో బాబు హయాంలో జరిగిన ఈ మద్యం స్కామ్పై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు పెడితే.. ఇప్పుడు అధికారంలోకి రాగానే విచారణకు భయపడి చంద్రబాబు ఆ కేసును మూసివేసేందుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. డిస్టలరీల వద్ద బేసిక్ వాల్యూని పెంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా? లేక వైయస్ఆర్సీపీ లాగా బేసిక్ వాల్యూకే కొంటే లంచాలు వస్తాయా?. ప్రభుత్వమే వైన్ షాపులు నడిపితే లంచాలు రావు.. కానీ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తేనే మామూళ్లు వస్తాయి. వైయస్. జగన్ హయాంలో మద్యం దుకాణాలను తగ్గించి, ధరలు పెంచి మద్యాన్ని నియంత్రిస్తే.. చంద్రబాబు హయాంలో కేవలం నాలుగైదు డిస్టలరీల వద్దే కొనుగోలు చేసి భారీగా కిక్ బ్యాగ్లు తీసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపులకు నిర్వహినంచిన ప్రైవేట్ టెండర్లలో టీడీపీ నేతలు మినహా ఇతరులెవరినీ టెండర్లు వేయనివ్వకుండా బెదిరించి దుకాణాలను లాక్కున్నారు. - బాబు మార్క్ లిక్కర్ స్కామ్.. ( క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని ఆయన వీడియోల సాక్షిగా ఉదాహరణలతో వివరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు) రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న మద్యం అమ్మకాలను గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వ లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యం ఎమ్మార్పీ ధరలకు దొరికే పరిస్థితి లేదు. విశాఖపట్నం (భీమిలి, వైజాగ్ సౌత్) భీమిలిలో ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వసూలు చేస్తుంటే.. వైజాగ్ సౌత్లో కరెంటు ఛార్జీలు పెరిగాయనే సాకుతో బాటిల్పై రూ.10 ఎక్కువేసి అమ్ముతున్నారు. ఏలూరు, భీమవరం: ఈ ప్రాంతాల్లో వ్యాపారస్థులంతా సిండికేట్గా మారి, ఎక్కడికెళ్లినా ప్రతి బాటిల్పై రూ.10 అదనంగా దండుకుంటున్నారు. సామాన్యుడి కోసం రూ.99లకే చౌకగా నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన చంద్రబాబు హామీ రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఈ అక్రమ సిండికేట్ వసూళ్ల వెనుక ఉన్నదంతా కరకట్ట మీది లింగమేనని గెస్ట్ హౌస్లో ఉండే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లకే ఈ దోపిడీ సొమ్మంతా బ్యాగులు, బ్యాగులుగా చేరుతోంది. ఇంత పెద్ద స్కామ్ చేస్తూ.. గతంలో నిష్పాక్షపాతంగా, నిజాయితీగా ప్రభుత్వమే షాపులు నడిపిన వైయస్ఆర్సీపీపై బురద జల్లడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. అంతే కాకుండా, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఐదు బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ అమ్ముడవుతోంది. మొలకల చెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ తంబల్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని వదిలేసి.. కేవలం రాజకీయ కక్షతో మాజీ మంత్రి జోగి రమేశ్, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను వేధిస్తున్నారు. - ఇచ్చిన హామీలు ఏవీ? చంద్రబాబు ఒక ’420 ముఖ్యమంత్రి’: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ’ఆడబిడ్డ నిధి’ ఇచ్చారా?. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భతి ఇచ్చారా? . 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇచ్చారా? గతంలో రుణమాఫీ, కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీలపై కూడా చంద్రబాబు మోసం చేశారు.. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు బ్రాండ్ అయితే, మాట తప్పకపోవడం వైయస్సార్, వైయస్ జగన్ల బ్రాండ్. ఎల్లో మీడియా రాతలకు, పోలీసుల బెదిరింపులకు వైయస్ఆర్సీపీ వెనకడుగు వేయదు. - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అభ్యంతరం: కులాల మధ్య చిచ్చు పెడుతోంది వైయస్ఆర్సీపీయేనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. కులం పేరు చెప్పి ప్రజలను మోసం చేసింది జనసేన అధిపతేనని, అధికారం కోసం కూటమి కట్టి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని వీరు అమలు చేయడం లేదని విమర్శించారు. దేశంలో మోసం, దగా చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని.. ప్రజలంతా ఈ కూటమి వైఫల్యాలను గమనిస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. - కూటమి ప్రభుత్వం తమ చేతిలో ఉన్న పోలీసులు, సిట్: వ్యవస్థలను వాడుకుంటూ, ఎల్లో మీడియా తప్పుడు రాతల సాయంతో వైయస్ఆర్సీపీని అణగదొక్కాలని చూస్తోందని అంబటి మండిపడ్డారు. ఇలాంటి ఉడత ఊపులకు వైయస్ జగన్ కానీ, వైయస్ఆర్సీపీ శ్రేణులు గానీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అబద్ధాలతో పాలిస్తున్న ఈ ’420 కూటమి’ వైఫల్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడతామని.. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తేల్చి చెప్పారు. మళ్లీ జగన్గారి నేతృత్వంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.