కడప: వక్ఫ్ సవరణ చట్టం-2025 లో పలు అంశాలపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం చేశారు. కడపలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంకి వ్యతిరేకంగా మొదట్నుంచి వైయస్ఆర్సీపీ పోరాడుతూ వచ్చిందని, ఆ మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని గుర్తుచేశారు. తనని కలిసిన ముస్లిం మత పెద్దలతో చెప్పిన మాట ప్రకారం పార్లమెంట్లో బిల్లు పాసైనప్పటికీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో సుప్రీంలో న్యాయం పోరాటం చేశామని, దాని ఫలితంగానే కొన్ని అంశాలపై స్టే వచ్చిందని అంజద్ బాషా వివరించారు. భవిష్యత్తులోనూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన ఏ అంశాన్నీ వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని హామీ ఇచ్చారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని రాష్ట్రంలో నమ్మకంగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం, పార్లమెంట్లో అనుకూలంగా ఓటేసి ముస్లింలకు వెన్నుపోటు పొడిచారని అంజద్బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... బిల్లుపై సుప్రీంకోర్టులో వైయస్ఆర్సీపీ పిల్ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025లో అనేక అంశాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని దేశంలోని అనేక సంఘాలు, పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. అయినప్పటికీ తమకున్న బలంతో లోక్సభ, రాజ్యసభలో ఆ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. కానీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వైయస్ఆర్సీపీ ఎంపీలు రెండు సభల్లోనూ ఈ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పాసైనప్పటికీ ముస్లిం మైనారిటీ సోదరుల హక్కులకు భంగం వాటిళ్లకూడదనే లక్ష్యంతో వైయస్ఆర్సీపీ న్యాయపోరాటం చేస్తూ వస్తోంది. ఈ బిల్లులో అనేక అంశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్న ఈ బిల్లును మొదటి నుంచీ వైయస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటినే ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో వైయస్ఆర్సీపీ తరఫున పిల్ వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక, ప్రజాసంఘాలు వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా మొత్తం సుప్రీంలో 127 కేసులు పిల్స్ నమోదు చేశాయి. వాటిపై సుప్రీం విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. వైయస్ఆర్సీపీ వ్యతిరేకించిన అంశాలపైనే స్టే వక్ఫ్ సవరణ చట్టం-2025 ని పూర్తిగా నిలుపుదల చేయాలని వైయస్ఆర్సీపీ పోరాడింది. అయితే ఈ బిల్లుపై స్టే ఇవ్వలేమని సుప్రీం ఉత్తర్వులిచ్చినా కొన్ని ముఖ్యమైన అంశాల్లో మాత్రం మా పోరాటాల ఫలితంగా సుప్రీం తీర్పుతో గొప్ప ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా సుప్రీం తీర్పును వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది. వక్ఫ్ చేసే వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనపై సుప్రీం స్టే విధించింది. ఎక్కడన్నా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకి లేదా వక్ఫ్కి ఇతర వ్యక్తులతో వివాదాలు తలెత్తినప్పుడు వాటిపై పూర్తిగా నిర్ణయాధికారం తీసుకునేలా కలెక్టర్కి సర్వాధికారాలు ఇస్తూ వక్ఫ్ సవరణ చట్టం చేశారు. దీనిపైనా సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని వైయస్ఆర్సీపీ మొదటి నుంచి పూర్తిగా వ్యతిరేకించింది. దీనిపైన సుప్రీం స్టే విధించడాన్ని వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది. ఓనర్ టైటిల్ నిర్ణయించే అధికారం ట్రిబ్యునల్ కి లేదా హైకోర్టుకి ఉంటుందన్న వైయస్ఆర్సీపీ వాదననే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులకు అవకాశం ఇస్తూ చేసిన సవరణ చట్టానికి సుప్రీంకోర్టు స్టే విధించకపోయినప్పటికీ మెజారిటీ సభ్యులు ముస్లింలే ఉండాలని చెప్పి ఉపశమనం కలిగించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 22 మంది సభ్యులుంటే అందులో నలుగురికి, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ఉండే 11 మంది సభ్యుల్లో ముగ్గురికి మించకుండా ముస్లిమేతరుల్ని నియమించాలని చెప్పడాన్ని కూడా వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది. వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లిమేతరులు కూడా ఉండొచ్చని వక్ఫ్ సవరణ చట్టంలో పెట్టిన అంశాన్ని వైయస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఈ వాదననే సమర్థించేలా సాధ్యమైనంత వరకు ముస్లింలనే వక్ఫ్ బోర్డు సీఈవోగా నియమించాలని చెప్పింది. మొత్తం 44 అంశాలపై వక్ఫ్ సవరణ చట్టం-2025లో సవరణలు చేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు అధ్యయనం చేయాల్సి ఉంది. ముస్లింలకు చెప్పిందే వైయస్ జగన్ చేశారు ముస్లింల మనోభావాలను, ముస్లిం సమాజానికి జరుగుతున్న అన్యాయంపై మొదటి నుంచి వైయస్ఆర్సీపీపోరాడుతూనే ఉంది. టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింలను పూర్తిగా వంచించినా వైయస్ఆర్సీపీ ముస్లింలకు అండగా నిలబడింది. బిల్లు విషయంలో ముస్లిం మత పెద్దలు వైయస్ జగన్ని కలిసినప్పుడు ముస్లిం సమాజానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకనేది లేదని స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పాసైనప్పటికీ వైయస్ఆర్సీపీ మాత్రం సుప్రీంకోర్టులో పిల్ వేసి పోరాటం చేస్తూ వచ్చింది. భవిష్యత్తులో కూడా వక్ఫ్ ఆస్తులు కాపాడే విషయంలో ముస్లిం మైనారిటీల పక్షాన నిలబడి వైయస్ఆర్సీపీ పోరాడుతుంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎళ్లవేళలా ముస్లింల పక్షాన అండగా నిలబడతారు. ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన పార్టీలు మాత్రం ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం చేసుకున్న ఈ రెండు పార్టీలు పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు-2025కి అనుకూలంగా ఓటేసి ముస్లింలకు తీరని ద్రోహం చేశారు.