ఈనెల 18న రెంటపాళ్ళకి మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

రెంట‌పాళ్లలో దివంగత గ్రామ ఉపస‌ర్పంచ్ కొర్ల‌కుంట నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ఆయ‌న 
విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్న మాజీ సీఎం 

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక‌ పోలీసుల వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కొర్ల‌కుంట నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వివ‌రాలు వెల్లడించిన గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

వైయ‌స్ జ‌గ‌న్ రెంటపాళ్ల ప‌ర్య‌ట‌న‌పైన పోలీసుల ఆంక్ష‌లు 

ఆయ‌న కాలు బ‌య‌ట‌పెడితే టీడీపీలో వ‌ణుకు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతుంటే చంద్ర‌బాబు, లోకేష్ ల‌కి భ‌యం 

అల‌జ‌డి సృష్టించి శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం క‌ల్పించే కుట్రలు   

గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి మండ‌లం రెంట‌పాళ్ల గ్రామ ఉప‌స‌ర్పంచ్ కొర్ల‌కుంట నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఈ నెల 18న వైయస్ జగన్ పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెంటపాళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైయస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైయస్ జగన్ రాకపై ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

స‌త్తెనప‌ల్లి మండలం రెంటపాళ్లకి వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తున్న నేప‌థ్యంలో పోలీసులు స్థానిక వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను పిలిపించి చిత్ర‌విచిత్ర‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు. మాజీ సీఎం వైయస్ జగన్ ఎటువంటి బహిరంగ స‌భ‌లు, ర్యాలీలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు రెంటపాళ్ళకు వెళ్ళడం లేదు. చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబాన్ని పరామర్శించ‌డానికి వెళ్తున్నా కూడా ఈ ప్ర‌భుత్వం జీర్ణించుకోలేక‌పోతోంది. అస‌లు వైయ‌స్ జ‌గ‌న్ ఇంటి గ‌డ‌ప దాటి బ‌య‌ట కాలు పెడితేనే చంద్ర‌బాబు, లోకేష్‌కి నిద్ర ప‌ట్ట‌డం లేదు. పొగాకు రైతుల‌ను పరామ‌ర్శించ‌డానికి పొదిలి వెళితే అల‌జ‌డి సృష్టించ‌డానికి కొంత‌మంది మ‌హిళ‌ల‌ను మోహ‌రించి న‌ల్ల బెలూన్ల‌తో నిర‌స‌నకి దిగారు. మా కార్య‌క‌ర్త‌లు, అమాయ‌క రైతుల మీద టీడీపీ గూండాల‌తో దాడులు చేయించారు. తిరిగి మా నాయ‌కుల‌పైనే అక్ర‌మ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. 

వైయస్ జగన్ పర్యటనను అడ్డుకుంటే సహించం

ఇటీవ‌లే వ్యాపారి గుత్తా ల‌క్ష్మీనారాయ‌ణ‌ పోలీసుల వేధింపులు భ‌రించ‌లేక విషం తాగి ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు త‌ట్టుకోలేక మా నాయ‌కులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని చ‌నిపోతుంటే వారికి భ‌రోసా ఇచ్చేందుకు వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తున్నారు. ఆయ‌న వెళ్లి ప‌రామ‌ర్శిస్తే పోలీసుల దుశ్చ‌ర్య‌లు ప్ర‌పంచానికి తెలిసిపోతాయ‌నే భ‌యంతో వైయస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఆంక్ష‌లు విధించి అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. ఈ దేశంలో ఎక్క‌డికైనా వెళ్లే స్వేచ్ఛ ప్ర‌తి పౌరుడికీ ఉంది. దాన్ని కాల‌రాసేందుకు ప్ర‌య‌త్నించ‌డం అప్ర‌జాస్వామికం. చంద్ర‌బాబు, లోకేష్ ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాలి. వైయస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌ల‌ను అడ్డుకోవాల‌ని చూడ‌టం ప్ర‌మాద‌క‌రమ‌ని హెచ్చ‌రిస్తున్నా. 

అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు

పొదిలిలో వైయ‌స్ జ‌గ‌న్ వెంట రైతులు, మా పార్టీ కార్య‌క‌ర్త‌లు వేలాది మందితో ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు నిర‌స‌న‌కు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారు? వైయస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో ఏరోజూ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య రాలేదు. మా నాయ‌కుడి ర్యాలీ మీద కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరి ఎలాగైనా శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించి ఆయన ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. మిర్చి రైతులను ప‌రామ‌ర్శించ‌డానికి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లిన‌ప్పుడు, స‌త్య‌సాయి జిల్లా రామ‌గిరి ప‌ర్య‌ట‌నకు వెళ్లిన‌ప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కి క‌నీస భ‌ద్ర‌త కూడా క‌ల్పించ‌కుండా ఇబ్బంది పెట్టాల‌ని చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వెళ్తున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని అడ్డుకోవ‌డానికి భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి అల‌జ‌డి సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉంది క‌దా అని పోలీసుల‌ను ఉసిగొల్పి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఈ ప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని సీఎం చంద్ర‌బాబు తెలుసుకోవాలి.

Back to Top